![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jul 11, 2025, 05:22 PM
బీజేపీ అధిష్ఠానం తన రాజీనామాను ఆమోదించిన అనంతరం గోషామహల్ శాసనసభ్యుడు రాజాసింగ్ 'ఎక్స్' వేదికగా స్పందించారు. పదవుల కోసం తాను ఈ నిర్ణయం తీసుకోలేదని, తుది శ్వాస వరకు సమాజ సేవలో నిమగ్నమవుతానని, హిందూ సమాజం హక్కుల కోసం తన గళం వినిపిస్తూనే ఉంటానని ఆయన ఆ ట్వీట్లో పేర్కొన్నారు.సుమారు 11 సంవత్సరాల క్రితం తాను బీజేపీలో చేరిన విషయాన్ని రాజాసింగ్ గుర్తు చేసుకున్నారు. ప్రజలకు, దేశానికి సేవ చేయాలనే లక్ష్యంతో పాటు హిందువుల హక్కుల పరిరక్షణ కోసం తాను బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఆ తరువాత బీజేపీ తనపై నమ్మకంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నుండి మూడుసార్లు ఎమ్మెల్యే టిక్కెట్టును ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. తనపై విశ్వాసం ఉంచిన బీజేపీ పెద్దలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.