|
|
by Suryaa Desk | Tue, Jun 24, 2025, 06:08 PM
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘రైతు భరోసా’ విజయోత్సవ సభల పట్ల మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేస్తూ సంబరాలు నిర్వహించుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎలాంటి నైతిక అర్హత లేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుత ప్రభుత్వం రైతుల కోసం ఏం చేసిందని ఈ ఉత్సవాలు జరుపుకుంటుందో చెప్పాలని ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తాము రైతులకు అందించిన తోడ్పాటును హరీశ్ రావు గుర్తుచేశారు. "మేము అధికారంలో ఉన్నప్పుడు 11 దఫాలుగా రైతుబంధు పథకం కింద రైతుల ఖాతాల్లోకి నేరుగా రూ.80 వేల కోట్లు జమ చేశాం. కానీ, ఏనాడూ ఇలాంటి ఉత్సవాలు, సంబరాలు నిర్వహించుకోలేదు" అని ఆయన తెలిపారు. రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని నిజాయతీగా అందించాలనే లక్ష్యంతోనే ఆ కార్యక్రమాన్ని అమలు చేశామని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి సృష్టించిన ఆర్థిక ఇబ్బందుల సమయంలో కూడా, ఎమ్మెల్యేలు, ఎంపీల జీతాల్లో కోత విధించినప్పటికీ, రైతులకు రైతుబంధు నిధుల జమ మాత్రం ఆపలేదని ఆయన నొక్కి చెప్పారు. కేసీఆర్ సారథ్యంలో తాము ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుని, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని హరీశ్ రావు అన్నారు. "నేడు దేశంలోని కొన్ని రాష్ట్రాలు రైతుబంధు తరహా పథకాలను అమలు చేస్తున్నాయంటే, దానికి కారణం కేసీఆర్ ముందుచూపే" అని ఆయన అభిప్రాయపడ్డారు.