|
|
by Suryaa Desk | Mon, Jun 23, 2025, 04:28 PM
తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్... రేషన్ కార్డు అర్హుల జాబితాలో నుంచి పలువురిని తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. అయితే ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం క్షేత్రస్థాయిలో విచారణ జరిపింది. అనుమానస్పద రేషన్ కార్డులు, గత కొన్ని నెలలుగా రేషన్ తీసుకోని వారి వివరాలను సేకరించింది. అయితే ఈ వివరాలను నిశితంగా పరిశీలించిన అధికారులు... ప్రస్తుతం ఉన్న రేషన్ లబ్దిదారుల్లో 76,842 మందిని అనర్హులుగా తేల్చారని ఈనాడు రిపోర్టు చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను కూడా జిల్లాల వారీగా పంపించినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల్లోనే వీరిని రేషన్ లబ్దిదారుల జాబితా నుంచి తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక, తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం, ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దరఖాస్తుల పరిశీలన తర్వాత దాదాపు రెండు లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులను జారీ చేసేందుకు ప్రభుత్వం సిద్దమైనట్టుగా తెలుస్తోంది. తద్వారా తెలంగాణలోని దాదాపు 80 శాతం కుటుంబాలు, జనాభా ఇప్పుడు రేషన్ కార్డులను కలిగి ఉన్నట్టుగా అవుతుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ వర్గాలు చెబుతున్నాయి. అధికారిక గణంకాలను పరిశీలిస్తే... తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్వహించి కుల గణన నివేదిక ప్రకారం రాష్ట్రంలో మొత్తం కుటుంబాల సంఖ్య 1,15,71,457గా, జనాభా 3,54,75,554 ఉంది. అయితే ప్రభుత్వం కొత్తగా 2.03 లక్షల కొత్త రేషన్ కార్డులను త్వరలోనే మంజూరు చేయాలని ప్రణాళికలు రచిస్తుంది. దీంతో రాష్ట్రంలో రేషన్ కార్డులు కలిసి కుటుంబాల సంఖ్య 91.98 లక్షలకు చేరుతుంది. ఇది రాష్ట్రంలోని మొత్తం కుటుంబాలలో 79.49 శాతం. మరోవైపు కొత్త రేషన్ కార్డుల జారితో లబ్దిదారుల సంఖ్య 3.11 కోట్లకు పెరగనుంది. ఇది రాష్ట్రంలోని మొత్తం జనాభాలో దాదాపు 80 శాతం.