|
|
by Suryaa Desk | Sat, Jun 21, 2025, 08:25 PM
తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, నదీజలాల పంపిణీ అంశం మరోసారి రాజకీయ దుమారం రేపుతోంది. ఈ కీలక విషయాలపై మాజీ మంత్రి హరీశ్రావుతో బహిరంగ చర్చకు సిద్ధమా అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి తీరుపై ఆయన విమర్శలు గుప్పించారు.హైదరాబాద్లో శనివారం దాసోజు శ్రవణ్ మీడియాతో మాట్లాడుతూ, సాగునీటి రంగంలో నెలకొన్న సమస్యలు, నదీజలాల వినియోగంపై మాజీ మంత్రి హరీశ్ రావుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించాలని డిమాండ్ చేశారు. ఇటీవల జరిగిన ఎంపీల సమావేశంలో తమ పార్టీ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర లేవనెత్తిన అంశాలకే ముఖ్యమంత్రి సరిగా సమాధానం చెప్పలేకపోయారని, అలాంటిది ఉద్యమనేత కేసీఆర్, అనుభవజ్ఞుడైన హరీశ్ రావులను ఎలా ఎదుర్కోగలరని ఆయన ప్రశ్నించారు. కేవలం పెద్దపెద్ద మాటలు చెప్పడమే కాకుండా, చేతల్లో కూడా చూపించాలని హితవు పలికారు.ముందుగా బనకచర్ల ప్రాజెక్టు ద్వారా తరలివెళుతున్న నీటిని ఆపాలని, అందుకు అవసరమైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సలహాలు, సహాయం తీసుకుంటే బాగుంటుందని శ్రవణ్ సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా, గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడం మినహా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కటైనా చెప్పుకోదగ్గ పని చేశారా అని ఆయన నిలదీశారు.గోదావరి నదిలో వెయ్యి టీఎంసీల నీళ్లు చాలు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను దాసోజు శ్రవణ్ తప్పుబట్టారు. తెలంగాణ ప్రయోజనాల కోసం, నీటి హక్కుల కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన కేసీఆర్ను విమర్శించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం నిర్మాణాత్మక విమర్శలను స్వీకరించి, ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని ఆయన సూచించారు.