|
|
by Suryaa Desk | Sat, Jun 21, 2025, 05:27 PM
గ్రానైట్ క్వారీ వ్యాపారిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని సుబేదారి పోలీసులు శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్ట్ చేసి వరంగల్కు తరలించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిసింది.ఈ పరిణామాల నేపథ్యంలో, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వినయ్ భాస్కర్, చల్లా ధర్మారెడ్డి తదితర బీఆర్ఎస్ నాయకులు. బీఆర్ఎస్ లీగల్ టీమ్తో కలిసి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ను కలిశారు. కౌశిక్ రెడ్డిపై నమోదు చేసిన కేసులోని సెక్షన్లను మార్చాలని వారు సీపీని కోరారు. దీనిపై స్పందించిన సీపీ, న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం వెల్లడిస్తానని వారికి తెలిపారు.అనంతరం మీడియాతో మాట్లాడిన ఎర్రబెల్లి దయాకర్ రావు, సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడి కారణంగానే కౌశిక్ రెడ్డికి బెయిల్ రాకుండా ఉండేందుకు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలను ప్రభుత్వం కావాలనే లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు పెడుతోందని ఆయన మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పాలన పూర్తిగా విఫలమైందని, అవినీతి పెరిగిపోయిందని విమర్శించారు. అంతకుముందు, సుబేదారి పోలీస్స్టేషన్లో ఉన్న కౌశిక్ రెడ్డిని ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆయన సోదరుడు ప్రతీక్ రెడ్డి పరామర్శించారు. వైద్య పరీక్షల అనంతరం కౌశిక్ రెడ్డిని కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు.