![]() |
![]() |
by Suryaa Desk | Tue, May 20, 2025, 06:40 PM
కొన్ని పనులు మనకు సరదానే కావచ్చు. కానీ వాటి వల్ల కొన్ని సందర్భాల్లో తీరని నష్టం వాటిల్లుతుంది. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. మహిళ సరదా నిండుప్రాణాన్ని బలి తీసుకుంది. అసలేం జరిగిందంటే.. సంగారెడ్డికి చెందిన మహిళ కారు డ్రైవింగ్ నేర్చుకునేందుకు గ్రౌండ్కి వచ్చింది. కానీ కారు అదుపు తప్పడంతో.. పక్కనే ఆడుకుంటున్న చిన్నారుల మీదకు దూసుకు వెళ్లింది. ఈ ప్రమాదంలో ఒక బాలుడు చనిపోగా.. మరో బాలిక పరిస్థితి విషమంగా ఉంది. మరో విషాదకరమైన అంశం ఏంటంటే.. చిన్నారులు ఇద్దరు తోబుట్టువులు. దీంతో ఆ తల్లిదండ్రుల బాధ వర్ణించడం కష్టంగా మారింది. ఆ వివరాలు..
ఆదివారం సాయంత్రం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలో ఈదారుణం వెలుగు చూసింది. సీఐ నరేశ్ తెలిపిన వివరాల ప్రకారం అమీన్పూర్, నవ్యకాలనీలో నివాసముండే మహేశ్వరి అనే మహిళ కారు నేర్చుకోవాలని భావించింది. దీంతో ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు భర్త రవిశేఖర్తో కలిసి పక్కనే ఉన్న నర్రెగూడెం గ్రౌండ్కు వచ్చింది. ఆ సమయంలో నర్రెగూడెం గ్రామానికి చెందిన శేఖర్, అనురాధ దంపతుల పిల్లలు మణిధర్ వర్మ (10), ఏకవాణి (12) అదే గ్రౌండ్లో ఆడుకుంటున్నారు. ఆ పిల్లలకు తోడుగా వారి పెద్దనాన్న, పెద్దమ్మలు అక్కడికొచ్చారు.
ఈక్రమంలో మహేశ్వరి డ్రైవింగ్ సీట్లో కూర్చుని కారును ముందుకు దూకించింది. కానీ ఉన్నట్లుండి ఆ కారు అదుపుతప్పి పిల్లలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మణిధర్ వర్మ, ఏకవాణి ఇద్దరు కారు చక్రాల కింద నలిగిపోయారు. ఇక చిన్నారి మణిధర్వర్మ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇక ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఏకవాణిని చికిత్స కోసం అదే కారులో బీరంగూడలోని హరిణి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలికకు ప్రాణాపాయం తప్పినట్లు తెలుస్తోంది.
యాక్సిడెంట్ విషయం తెలుసుకున్న బాధితుల బంధువుల.. సంఘటనా స్థలానికి చేరుకుని.. మహేశ్వరి కారుపై దాడి చేశారు. దీంతో అది ధ్వంసం అయ్యింది. ఈ ఘటనపై బాధితులు బంధువులు అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు.. మహేశ్వరి, భర్త రవిశేఖర్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ఈ ఘటనలో చనిపోయిన మణిధర్ వర్మ మృతదేహానికి పటాన్చెరు ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఆ తర్వాత డెడ్బాడీని కుటుంబసభ్యులకు అప్పగించారు. సోమవారం నాడు మణిధర్వర్మ మృతదేహానికి తల్లిదండ్రులు అంత్యక్రియలు నిర్వహించారు.