|
|
by Suryaa Desk | Tue, Oct 21, 2025, 04:29 PM
రాష్ట్రంలోని పలు నర్సింగ్ కాలేజీలకు భారీ షాక్ తగిలింది. 1, 2 కాదు ఏకంగా 14 కాలేజీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కారణం ఆయా కాలేజీలు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు తేలింది. దీంతో వైద్య విద్య సంచాలకుడు.. నిబంధనలు పాటించని ఈ 14 కాలేజీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీని గురించి ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఈ 14 నర్సింగ్ విద్యా సంస్థల్లో.. 7 కాలేజీలు.. ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన చోట కాకుండా వేరే ప్రాంతంలో నడుస్తున్నాయి. మరో ఏడింటిలో తగినంత మంది అధ్యాపకులు లేరు. ఈ 14 కాలేజీల మీద ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో.. తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు అధికారులు తనిఖీలు నిర్వహించి, నివేదిక సమర్పించారు.
తెలంగాణలో పలు నర్సింగ్ స్కూల్స్ , కాలేజీల తీరుపై గత కొన్నాళ్లుగా ప్రభుత్వానికి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. ఈక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వీటిపై స్పందించి, తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు హైదరాబాద్, నల్లగొండ, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు నర్సింగ్ స్కూల్స్, కాలేజీల్లో తనిఖీలు నిర్వహించారు. మొత్తం 23 నర్సింగ్ స్కూల్స్ మీద ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. దీంతో.. ఒక్కో నర్సింగ్ స్కూల్కు ఇద్దరు చొప్పున మొత్తం 46 మంది అధికారులు తనిఖీలు నిర్వహించారు. రెండు రోజుల పాటు తనిఖీలు నిర్వహించిన తర్వత లోపాలున్న, నిబంధనలు పాటించని కాలేజీలపై నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించారు.
ఈ తనిఖీలపై అకడమిక్ డీఎంఈ మాట్లాడుతూ, "ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికంగా ఫిర్యాదులు అందిన 23 నర్సింగ్ స్కూల్స్లో రెండు రోజుల పాటు తనిఖీలు నిర్వహించాం. ఆయా విద్యాసంస్థల్లో ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ (ఐఎన్సీ) నిబంధనల మేరకు.. ప్రతి కాలేజీలో సరిపడ సంఖ్యలో అధ్యాపకులు ఉన్నారా.. లేరా అనే విషయాలను పరిశీలించాము. అలానే ఆయా కాలేజీల్లో సరైన మౌలిక సదుపాయాలున్నాయా లేదా అనే అంశాలను అధికారులు పరిశీలించారు. వీటితో పాటుగా ఆయా కాలేజీలు.. ప్రభుత్వం అనుమతిచ్చిన చోటనే నడుపుతున్నారా లేదా అనే విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నాము. తనిఖీలకు వెళ్లిన అధికారులు ఇచ్చిన నివేదికల ఆధారంగా ప్రభుత్వానికి సమగ్ర నివేదికను సమర్పించాము. మా నివేదిక ఆధారంగా.. నిబంధనల ప్రకారం నడవని నర్సింగ్ స్కూల్స్పై చర్యలుంటాయి" అని తెలిపారు. త్వరలోనే ప్రభుత్వం నిబంధనలు పాటించని కాలేజీలపై చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నారు.