|
|
by Suryaa Desk | Mon, Sep 22, 2025, 07:18 PM
తెలంగాణ లో దసరా పెద్ద పండుగ. దీన్ని దృష్టిలో పెట్టుకుని.. పలు ప్రైవేటు కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు ఉద్యోగులకు బోనస్, కానుకలు ఇవ్వడం చేస్తుంటాయి. ఉత్తరాదిలో దీపావళి సందర్భంగా ఉద్యోగులకు బోనస్, గిఫ్ట్స్ వంటివి ఇస్తే.. మన దగ్గర మాత్రం దసరాకే ఇస్తారు. ఇప్పటికే సింగరేణి సంస్థ దసరా పండుగ సందర్భంగా కార్మికులకు బోనస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా దసరా పండుగ సందర్భంగా తెలంగాణ సర్కార్ ఆర్టీసీ కార్మికులకు శుభవార్త చెప్పింది. ఆ వివరాలు..
ఆర్టీసీ యాజమాన్యం.. కార్మికులకు శుభవార్త చెప్పింది. దసరా పండుగ నేపథ్యంలో కీలక ప్రకటన చేసింది. పండుగ వేళ సిబ్బంది, కార్మికులకు దసరా అడ్వాన్స్ మంజూరు చేస్తూ సోమవారం ఆర్టీసీ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి సప్లిమెంటరీ పే బిల్లులను వెంటనే తయారు చేసి చెల్లింపు చేయాలని సూచించింది.
కార్మికులకు అడ్వాన్స్గా ఇచ్చే ఈ మొత్తాన్ని పది సమాన వాయిదాల్లో తిరిగి వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇలా తీసుకున్న అడ్వాన్స్కు సంబంధించిన మొత్తాన్ని వారికి చెల్లించే 2025, నవంబర్ జీతం నుంచి వసూలు చేస్తామని ప్రకటించారు. ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయంపై సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. దసరా పండుగకు ముందుగానే కార్మికులకు బోనస్ ఇస్తున్నట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ సంవత్సరం సింగరేణిలో ఒక్కో కార్మికుడికి దసరా కానుకగా రూ. 1,95, 610 ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అలానే కాంట్రాక్ట్ ఉద్యోగులకు రూ. 5,500 అందజేస్తామని తెలిపారు. అలానే దీపావళికి కూడా కార్మికులకు లాభాల్లో వాటాలు పంచుతామని డిప్యూటీ సీఎం ప్రకటించారు.
బతుకమ్మ, దసరా పండుగ నేపథ్యంలో ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడిపేందుకు నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. పండుగ వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని.. 7,754 ప్రత్యేక బస్సులను నడిపేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఈ ప్రత్యేక బస్సుల్లో టికెట్ ధరను 50 శాతం పెంచిన సంగతి తెలిసిందే. అలానే ఈప్రత్యేక బస్సుల్లో 377 స్పెషల్ సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ అవకాశాన్ని కల్పించారు. సెప్టెంబర్ 27, 28, 29 తేదీల్లో ప్రయాణికుల రద్దీ భారీగా ఉంటుందని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు నగర శివార్ల నుంచే ప్రత్యేక బస్సులను నడపనున్నారు. అలానే పండుగ వేళ నడిచే అన్ని ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళా ప్రయాణికులకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని తెలిపారు.