|
|
by Suryaa Desk | Sun, Sep 21, 2025, 09:11 PM
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర అభివృద్ధి పనుల్లో గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జాతర అభివృద్ధి కోసం రూపొందించే మాస్టర్ ప్లాన్లో గిరిజన సంప్రదాయాలకు ఎలాంటి లోటు రాకుండా చూడాలని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశంపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులు, ఉన్నతాధికారులతో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.అభివృద్ధి ప్రణాళికలను ఖరారు చేసే ముందు క్షేత్రస్థాయిలో సమ్మక్క-సారలమ్మ పూజారులతో చర్చించి, వారి సలహాలు, సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలని సీఎం తెలిపారు. ఇందులో భాగంగా, ఈ నెల 23న తాను స్వయంగా మేడారం సందర్శిస్తానని, మంత్రులు, అధికారులు, గిరిజన ప్రజాప్రతినిధులతో కలిసి డిజైన్లను ఖరారు చేస్తామని వెల్లడించారు. అభివృద్ధి పనులను పర్యవేక్షించేందుకు వెంటనే ఒక టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలక సూచనలు చేశారు. "పూజారులు కోరినట్లుగా ఆలయ ప్రాంగణాన్ని విస్తరించాలి. అయితే, అమ్మవార్ల గద్దెలను రాతి రూపాలు మాత్రం యథాతథంగా, ఎలాంటి మార్పులు చేయకుండా ఉంచాలి," అని ఆయన స్పష్టం చేశారు. మేడారంలో నిర్మించే స్వాగత తోరణాలు, ఇతర కట్టడాలన్నీ గిరిజన సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉండాలని, ఆలయ పరిసరాల్లో స్థానిక సంప్రదాయ వృక్షాలను నాటాలని సూచించారు.ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, ప్రభుత్వ సలహాదారు వి. వెంకట నరేందర్ రెడ్డి, ఎంపీ పోరిక బలరామ్ నాయక్, పలువురు అధికారులు పాల్గొన్నారు. 2026 నాటికి మేడారం జాతరను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా, భక్తులకు ఆధునిక సదుపాయాలతో నిర్వహించడమే లక్ష్యంగా ఈ అభివృద్ధి ప్రణాళికలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.