|
|
by Suryaa Desk | Sun, Jul 06, 2025, 09:51 PM

ఈ రోజుల్లో హ్యాకర్లకు ఒక ప్రత్యేక లక్ష్యం అంటూ ఏమీ లేదు. అమాయకులనే కాకుండా, చదువుకున్న వారితో సహా చదువు లేని వారు సైతం మోసాలకు గురవుతున్నారు. హ్యాకర్లు ప్రపంచంలోని ఏ మూల నుంచైనా దాడులకు పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో.. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సైబర్ మోసాలు పెచ్చుమీరిపోతున్నాయి. ముఖ్యంగా వాట్సాప్ గ్రూపులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి.
తాజాగా.. బోథ్ నియోజకవర్గానికి చెందిన పలు వాట్సాప్ గ్రూపులలో ఆదివారం ‘SBI REWARDZ’ పేరుతో వచ్చిన కొన్ని అనుమానాస్పద మెసేజ్లు, లింకులు, APK ఫైళ్లు, PDF ల వల్ల చాలా గ్రూపులు హ్యాక్ అయినట్లు సమాచారం. గుర్తు తెలియని నంబర్ల నుండి వచ్చిన ఈ మెసేజ్లను తెరిచిన కొందరి ఫోన్లు హ్యాక్ అయ్యాయని ఆ గ్రూపు సభ్యులు తెలిపారు.
మరీ దారుణంగా.. కొన్ని గ్రూపుల పేర్లను కూడా మార్చి ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’గా మార్చేశారు. ఇది సైబర్ నేరగాళ్ల విచ్చలవిడికి.. వారి విస్తృత దాడుల తీరును స్పష్టం చేస్తోంది. ఇవి కేవలం వ్యక్తిగత ఫోన్లనే కాదు, సామూహిక కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్లను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నాయని ఇది రుజువు చేస్తుంది. హ్యాకర్లు వివిధ రకాల వ్యూహాలతో ప్రజలను మోసం చేస్తారు. వీటిలో కొన్ని ప్రధానమైనవి ఇలా ఉన్నాయి.
ఫిషింగ్ (Phishing): ఇది అత్యంత సాధారణ పద్ధతి. బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు లేదా ప్రముఖ కంపెనీల నుండి వచ్చినట్లు నమ్మబలికే ఈమెయిళ్ళు లేదా మెసేజ్లు పంపిస్తారు. వీటిలో నకిలీ వెబ్సైట్ల లింకులు ఉంటాయి. మీరు ఆ లింకులను క్లిక్ చేసి మీ వివరాలు ఎంటర్ చేస్తే, అవి నేరుగా హ్యాకర్ల చేతుల్లోకి వెళ్తాయి.
మాల్వేర్ (Malware): అనుమానాస్పద APK ఫైళ్లు (ఆండ్రాయిడ్ యాప్ ప్యాకేజీలు), PDF లు లేదా ఇతర అటాచ్మెంట్ల ద్వారా మీ ఫోన్ లేదా కంప్యూటర్లోకి మాల్వేర్ను పంపిస్తారు. ఇది మీ డేటాను దొంగిలించగలదు, మీ పరికరాన్ని రిమోట్గా నియంత్రించగలదు.
గుర్తు తెలియని నంబర్ల నుండి లేదా అనుమానాస్పదంగా కనిపించే మెసేజ్లు, లింకులు, APK ఫైళ్లు, PDF లు వస్తే వాటిని అస్సలు తెరవకండి. వాటిని తక్షణమే డిలీట్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. ఫోన్ చేసి బ్యాంక్ వివరాలు, OTP లు, పిన్లు లేదా ఇతర వ్యక్తిగత సమాచారం అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకండి. బ్యాంకులు, అధికారిక సంస్థలు ఎప్పుడూ ఫోన్లో ఈ వివరాలను అడగవని గుర్తుంచుకోవాలి.
మీ ఫోన్, కంప్యూటర్లో నమ్మకమైన యాంటీవైరస్ సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేసుకోండి, ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోండి. అన్ని ఆన్లైన్ ఖాతాలకు బలమైన, భిన్నమైన పాస్వర్డ్లను ఉపయోగించండి. రెగ్యులర్గా వాటిని మార్చండి. టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2FA) ఎనేబుల్ చేసుకోవడం మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు. మీ ఆపరేటింగ్ సిస్టమ్, అప్లికేషన్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయండి. ఇది భద్రతా లోపాలను సరిచేస్తుంది.