![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jul 06, 2025, 12:03 AM
తెలంగాణలో తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం (మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం) టీజీఆర్టీసీకి కొత్త జీవం పోసిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం ప్రజా భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. మంత్రి సీతక్కతో కలిసి 151 మండల మహిళా సంఘాల గ్రూప్లకు (అద్దె బస్సుల యజమానులకు) రూ.1.05 కోట్ల చెక్కును ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ప్రారంభించిన తర్వాత రాష్ట్రంలోని మహిళలంతా ఎంతో సంతోషంగా ఉన్నారని అన్నారు. ఇది మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం వేస్తున్న కీలక అడుగు అని చెప్పారు.
బస్సెక్కుతున్నామని మహిళలు చెబుతున్నారని పొన్నం గుర్తుచేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామని.. ఈ పథకం వల్ల ఆర్టీసీ మరోసారి బతికిందని పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే దాదాపు 200 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేసిన రికార్డు నమోదు కాబోతుందని తెలిపారు. ఇప్పటివరకు రూ.6500 కోట్ల విలువైన ఉచిత ప్రయాణం నమోదైందని, ఈ డబ్బులు ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించిందని స్పష్టం చేశారు.
మహాలక్ష్మి పథకం విజయవంతం కావడం కోసం డ్రైవర్లు, కండక్టర్లు ఎంతో కష్టపడుతున్నారని వారి సేవలను కొనియాడారు. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ నష్టాల నుంచి లాభాల బాట పడుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్టీసీలో కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నామని.. కొత్త నియామకాలు చేపడుతున్నామని తెలిపారు. మహిళలు ఎక్కడికి వెళ్లాలన్నా ఆర్టీసీ ఉచిత బస్సులను వాడుకుంటున్నారని, ఇది ఆర్టీసీకి ఆదాయాన్ని పెంచుతుందని అన్నారు. ఈ అంశంపై తెలంగాణ వ్యాప్తంగా గ్రామ గ్రామాన సంబరాలు నిర్వహించాలని కాంగ్రెస్ శ్రేణులకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ పథకం కేవలం ఉచిత ప్రయాణం మాత్రమే కాదని, మహిళల స్వేచ్ఛకు, ఆర్థిక భద్రతకు ఒక చిహ్నంగా మారిందని పేర్కొన్నారు.