|
|
by Suryaa Desk | Fri, Jul 04, 2025, 07:49 PM

హైడ్రా కమిషనర్ రంగనాథ్ బాలానగర్ ప్రాంతంలో ఆకస్మిక పర్యటన చేపట్టారు. అధికారుల బృందం, కాంగ్రెస్ నాయకులతో కలిసి వినాయకనగర్ కాలనీలోని గడ్డి చేను స్థలానికి ఆనుకొని ఉన్న నాలాను పరిశీలించడానికి వెళ్లారు. అయితే.. నాలా వద్దకు వెళ్లే దారికి గేట్లు వేసి తాళాలు వేయడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితిని గమనించిన కమిషనర్ రంగనాథ్, గేటుకు వేసిన తాళాన్ని పగలగొట్టాలని అధికారులను వెంటనే ఆదేశించారు. ఈ సమయంలో ఆనంద్ రెడ్డి అనే వ్యక్తి హుటాహుటిన అక్కడికి రావడంతో.. గేటుకు తాళం వేయడం ఏ మాత్రం సరికాదని హైడ్రా కమిషనర్ ఆయనను తీవ్రంగా హెచ్చరించారు.
అనంతరం తాళాలు తీసి లోపలికి వెళ్లి, నాలా ఆక్రమణలను తక్షణమే తొలగించాలని అక్కడి అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత వినాయక నగర్, కళ్యాణ్ నగర్ వద్ద ఉన్న నాలాలను కూడా ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. నాలాలను అడ్డుకుని నిర్మాణాలు చేపట్టడం, వ్యర్థాలు వేయడం వంటివి వరదలకు కారణమవుతాయని.. అలాంటి వాటిని ఉపేక్షించబోమని ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ.. నాలా ఉన్న ప్రాంతంలో ఎక్కడ ఖాళీ స్థలం ఉన్నా, అక్కడ ఉన్న ఆక్రమణలను తక్షణమే తొలగిస్తామని అన్నారు. నాలా లోపల పేరుకుపోయిన స్లిల్ట్ను (పూడికను) కూడా తొలగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వారం రోజుల్లో స్థానిక కాలనీ ప్రజలతో సమావేశం ఏర్పాటు చేస్తామని.. వారి అభిప్రాయాలను తీసుకుంటామని తెలిపారు.
నాలా మొత్తం పొడవునా డ్రోన్ కెమెరాతో వీడియో చిత్రీకరించి.. ఆక్రమణలను స్పష్టంగా గుర్తించే ప్రక్రియను చేపడతామని ఆయన వెల్లడించారు. నాలా ఆక్రమణల విషయంలో ఎలాంటి పరిస్థితుల్లోనూ రాజీ పడేది లేదని.. కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇది నగరంలో వర్షాకాలంలో తలెత్తే వరద సమస్యలను నివారించడంలో హైడ్రా నిబద్ధతను తెలియజేస్తుంది. ఈ కఠినమైన వైఖరితో భవిష్యత్తులో ఇలాంటి ఆక్రమణలకు చెక్ పెట్టాలని రంగనాథ్ లక్ష్యంగా పెట్టుకున్నారు.