|
|
by Suryaa Desk | Thu, Jul 03, 2025, 08:49 AM
హైదరాబాద్ శివారులోని కాటేదాన్లో ఈ తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఓ రబ్బరు పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగి పొగలు దట్టంగా కమ్ముకున్నాయి.కాటేదాన్ పారిశ్రామికవాడలోని శివం రబ్బర్ ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటుచేసుకుంది. పరిశ్రమలో ఉన్నట్టుండి మంటలు ఎగసిపడి అవి వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మొత్తం నాలుగు ఫైరింజన్లను రంగంలోకి దించి, మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు.పరిశ్రమలో పెద్ద ఎత్తున రబ్బరు, ఇతర ముడిసరుకు ఉండటంతో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. దీనివల్ల ఆ ప్రాంతమంతా నల్లటి దట్టమైన పొగలు కమ్ముకొని ఉక్కిరిబిక్కిరి చేశాయి. అగ్నిమాపక సిబ్బంది కొన్ని గంటల పాటు శ్రమించి చివరకు మంటలను పూర్తిగా ఆర్పివేశారు. ఈ ప్రమాదం కారణంగా జరిగిన ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు