![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jun 26, 2025, 08:20 PM
పటాన్చెరు : పటాన్చెరు నియోజకవర్గానికి నూతనంగా మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల భవనాల నిర్మాణం కోసం భూమి కేటాయించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్యను పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. గురువారం సాయంత్రం సంగారెడ్డి లోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ తో ఎమ్మెల్యే జిఎంఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై కలెక్టర్ తో చర్చించారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు కోసం ప్రభుత్వం ఇటీవల 200 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు. స్కూల్ ఏర్పాటు కోసం పటాన్చెరు రెవెన్యూ పరిధిలోని పోచారం గ్రామ పరిధిలో గల సర్వే నంబర్ 69లో 20 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ తోపాటు పాలిటెక్నిక్ కళాశాలకు శాశ్వత భవనం కోసం ఇదే సర్వే నంబర్ లో భూమిని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే పాలిటెక్నిక్ కళాశాల తరగతుల కోసం తాత్కాలిక ప్రాతిపదికన పటాన్చెరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేశామని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం లోపు భవన నిర్మాణాలు పూర్తయితే విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కోసం ప్రభుత్వం ఇప్పటికే 200 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడంతో భూమి కేటాయించిన వెంటనే పనులు ప్రారంభించవచ్చని పేర్కొన్నారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ ప్రావిణ్య త్వరలోనే భూమి కేటాయింపులపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.