![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jun 04, 2025, 07:57 PM
తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు. ఇకపై అంగన్వాడీల్లో వారానికి ఒకటి, రెండు సార్లు ఎగ్ బిర్యానీ వడ్డించేలా మెనూలో మార్పులు చేయబోతన్నట్లు ప్రకటించారు. అలానే అంగన్వాడీల ద్వారా చిన్నారులకు అందిస్తున్న ఆహారపదార్థాలను మరింత రుచికరంగా మారుస్తామని తెలిపారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని తెలంగాణ గ్రామీణాభివద్ధి సంస్థలో బుధవారం నాడు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మేధోమధన సదస్సులో సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె పలు అంశాలపై చర్చించడమే కాక కీలక ప్రకటనలు చేశారు. ఆ వివరాలు..
చిన్నారుల్లో పోషకాహార లోపం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. వారికి అంగన్వాడీల ద్వారా అందిస్తున్న విద్య, ఆరోగ్య భద్రత అంశాలను మెరుగుపరుచుకునే లక్ష్యంతో పని చేయాలని సూచించారు. అలానే అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే గర్బిణీలు, బాలింతలు కింద కూర్చోవాలంటే.. ఇబ్బందిపడుతున్నారని తాము గుర్తించినట్లు చెప్పుకొచ్చారు. ఈసమస్యలను తొలగించేందుకు.. త్వరలోనే అంగన్వాడీకేంద్రాలకు బెంచీలను సరఫరా చేస్తామని ప్రకటించారు. అలానే ప్రస్తుతం అంగన్వాడీ టీచర్లు వాడుతున్న మొబైల్ ఫోన్ల స్థానంలో అధునాతనమైన వాటిని అందజేస్తామని మంత్రి సీతక్క తెలిపారు.
అలానే బడిగంట తరహాలోనే.. అంగన్వాడీ కేంద్రాల్లో కూడా బెల్స్ విధానం తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్లు మంత్రి సీతక్క చెప్పారు. గంట మోగించడం ద్వారా చిన్నారుల్లో బాల్యం నుంచే క్రమశిక్షణ, ఉత్సాహం, పెరుగుతాయని అన్నారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల మీద పని ఒత్తిడి తగ్గించేందుకు త్వరలోనే 14 వేల ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపారు. ప్రైవేటే ప్లే స్కూల్స్కి దీటుగా అంగన్వాడీ కేంద్రాలను తీర్చిదిద్దుతున్నామని చెప్పుకొచ్చారు.
అలానే అంగన్వాడీల్లో చిన్నారుల చదువు, ఆటవిడుపు, సౌకర్యం కోసం మొత్తం 57 రకాల వస్తువులను ప్రభుత్వం సరఫరా చేస్తుందని తెలిపారు. అంగన్వాడీల్లో అడ్మిషన్లు పెంచేందుకు అమ్మమాట.. అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చారు. అలానే అంగన్వాడీ కేంద్రాలకు నాసిరకం సరుకులు సరఫరా చేసే వారిని బ్లాక్ లిస్టులో పెడుతున్నామని హెచ్చరించారు. అలానే అంగన్వాడీ కేంద్రాల ద్వారా సరఫరా అయ్యే కోడిగుడ్ల విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ఇక తెలంగాణ ప్రభుత్వం చిన్నారులు, మహిళలు, బాలికలు, యువతుల ఆరోగ్యం, వికాసం కోసం అనేక రకాల కార్యక్రమాలను అమలు చేస్తుంది. కొన్నిరోజుల క్రితమే రక్తహీనత సమస్య పరిష్కారం కోసం ఇందిరమ్మ అమృతం పథకంలో భాగంగా 14-18 ఏళ్ల యువతులకు అంగన్వాడీల ద్వారా నెలకు 30 చిక్కీలను ఇవ్వాలని నిర్ణయించింది. ముందుగా పైలెట్ ప్రాజెక్ట్ కింద కొన్ని ప్రాంతాల్లో మాత్రమే దీన్ని అమలు చేస్తున్నారు. త్వరలోనే రాష్ట్రం అంతా విస్తరిస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు.