![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 23, 2025, 05:59 PM
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తన రాజకీయ ప్రవేశంపై గత కొంతకాలంగా వస్తున్న ఊహాగానాలకు మరింత ఆసక్తిని రేకెత్తించారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘జన నాయగన్’ చిత్రమే తన చివరి సినిమా అవుతుందా? అనే ప్రశ్నకు విజయ్ సూటిగా సమాధానం చెప్పలేదని, తన నిర్ణయం 2026 ఎన్నికల ఫలితాలపై ఆధారపడి ఉంటుందని చెప్పినట్లు నటి మమితా బైజు వెల్లడించారు. ఈ వ్యాఖ్యలతో విజయ్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టే అవకాశాలున్నాయనే చర్చ జోరందుకుంది.‘జన నాయగన్’ చిత్రంలో విజయ్తో కలిసి నటిస్తున్న మమితా బైజు ఇటీవల ఓ సందర్భంలో మాట్లాడుతూ, షూటింగ్ సమయంలో విజయ్ను ఈ విషయం గురించి అడిగినట్లు తెలిపారు. "‘జన నాయగన్’ మీ చివరి సినిమానా అని విజయ్ గారిని అడిగాను. దానికి ఆయన, ‘ఆ విషయం ఇప్పుడే చెప్పలేను. అది 2026 ఎన్నికలపై ఆధారపడి ఉంటుంది’ అని నాతో అన్నారు" అని మమిత వివరించారు. ఇక, ఈ సినిమా చిత్రీకరణ చాలా సరదాగా సాగిందని, చివరి రోజు షూటింగ్లో చిత్ర యూనిట్ సభ్యులందరితో పాటు విజయ్ కూడా భావోద్వేగానికి గురయ్యారని, అందుకే టీమ్తో కలిసి ఫొటోలు కూడా దిగలేకపోయారని ఆమె గుర్తుచేసుకున్నారు. అయితే, సినిమాలో తన పాత్ర గురించి ఇప్పుడే ఏమీ చెప్పనని, తెరపైనే చూడాలని మమిత తెలిపారు.హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జన నాయగన్’ చిత్రాన్ని పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రకటించినప్పటి నుంచి ఇది విజయ్ చివరి చిత్రం కావచ్చనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది.
Latest News