|
|
by Suryaa Desk | Thu, Oct 23, 2025, 06:54 PM
తెలంగాణ రాష్ట్రంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2026-27 ఆర్థిక సంవత్సరానికి చేపట్టే పనులను గుర్తించే ప్రక్రియ ముమ్మరమైంది. ఈ లక్ష్యంగా అక్టోబర్ 17 నుంచి రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలను నిర్వహిస్తున్నారు. ఈ పనుల గుర్తింపు ప్రక్రియను నవంబర్ 30వ తేదీలోపు పూర్తి చేయాలని అధికారులు ప్రణాళిక రూపొందించారు.
గ్రామసభల ద్వారా కార్యాచరణ ప్రణాళిక..
వాస్తవానికి.. ఈ గ్రామసభలను ఈ నెల 2వ తేదీ నుంచే నిర్వహించాల్సి ఉన్నప్పటికీ.. ఆ సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వల్ల సాధ్యం కాలేదు. తాజాగా.. అధికారులు సిద్ధం చేసిన ప్రణాళిక ప్రకారం గ్రామసభలు జరుగుతున్నాయి. గ్రామాలలో జాబ్కార్డులు కలిగిన కూలీల సంఖ్యకు అనుగుణంగా పనులను గుర్తిస్తారు.
ఉపాధి పథకం కింద సాధారణంగా 250 రకాల పనులు నిర్వహించేందుకు అవకాశం ఉన్నప్పటికీ.. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల వంటి కొన్ని ప్రాంతాలలో 39 రకాల పనులు చేసేందుకే అనుమతి ఉందని అధికారులు తెలిపారు. ఈ గుర్తించిన పనులకు ప్రజాభిప్రాయంప్రకారం ఆమోదం తీసుకుంటారు. ఆ తరువాత.. ఈ ప్రతిపాదనలను మండల పరిషత్తుకు, ఆపై జిల్లా స్థాయి అధికారులకు పంపి తుది ఆమోదం పొందాల్సి ఉంటుంది.
ఇప్పటికే గుర్తించిన పనులను 2026 మార్చి 31వ తేదీలోపు పూర్తి చేయాలి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్తగా గుర్తించిన పనులను మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఎక్కువ మంది కూలీలకు పనులు కల్పించేలా పక్కా ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు ఖమ్మం జిల్లా ఏపీడీ రవి పేర్కొన్నారు.
ఈ ఏడాది నుంచి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కూడా ఉపాధి హామీ కూలీల సేవలను వినియోగించుకోవాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మేలు జరగటమే కాకుండా.. నిర్మాణాలు కూడా వేగంగా ఊపందుకునే అవకాశం ఉంది. ఉపాధి హామీ పథకం కింద సాధారణంగా నీటి కుంటలు, పూడికతీత (Desilting), పిచ్చి మొక్కల తొలగింపు, ఇంకుడు గుంతల నిర్మాణం , పశువుల పాకలు, పంచాయతీ నర్సరీల్లో మొక్కల పెంపకం, పండ్ల తోటల పెంపకం , పశుగ్రాసం పెంపకం , నీటి మళ్లింపు కాలువలు , సీసీ రహదారులు, పాఠశాలల్లో మరుగుదొడ్లు, ప్రహరీల నిర్మాణం వంటి పనులు చేపడతారు. రైతులు, కూలీలకు ఉపయోగపడే పనులకు ప్రాధాన్యమిస్తున్నట్లు అధికారులు తెలిపారు.