|
|
by Suryaa Desk | Mon, Sep 22, 2025, 04:57 PM
తెలంగాణ సర్కార్ రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటుంది. కొత్త రహదారుల నిర్మాణం, ఉన్న వాటిని విస్తరించడం, అభివృద్ధి చేయడం కోసం భారీ ఎత్తున నిధులను కేటాయిస్తుంది. అలానే రాష్ట్రంలో హ్యామ్ రోడ్లు, గ్రీన్ఫీల్డ్ రహదారుల నిర్మాణం కోసం కూడా చర్యలు తీసుకుంటుంది. ప్రధాన పట్టణాలు, నగరాల్లో మాత్రమే కాక.. గ్రామీణ ప్రాంతాల్లో కూడా నూతన రహదారుల నిర్మాణం, రోడ్ల విస్తరణకు చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా రేవంత్ సర్కార్.. మంత్రి సీతక్క చొరవతో ఆ ప్రాంతంలో రోడ్ల విస్తరణకు ఏకంగా 12 కోట్ల రూపాయలు కేటాయించింది. సర్కార్ నిర్ణయంతో ఆ ప్రాంతం రూపురేఖలు మారిపోనున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు..
తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చొరవతో మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ మండల కేంద్రంలోని రోడ్ల విస్తరణకు రేవంత్ సర్కార్ తాజాగా ఆమోదం తెలిసింది. ఈ ప్రాంతంలో రోడ్లు వెడల్పు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం 12 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో.. ఆర్ అండ్ బీ శాఖ ఇంజినీర్లు రోడ్ల విస్తరణ పనుల కోసం టెండర్లు పిలిచేందుకు ప్రణాళికలు రెడీ చేస్తున్నారు.
దీనిలో భాగంగా ఇల్లందు రోడ్డు 48వ కిలోమీటర్ రాయి నుంచి నర్సంపేట వైపు ఉన్న 50వ కిమీ రాయి వరకు రోడ్డును వెడల్పు చేయనున్నారు. దీంతోపాటు గుంజేడు రోడ్డులో డంపింగ్ యార్డ్ వరకు రోడ్డును వెడల్పు చేయనున్నారు. అలానే ఓటాయి రోడ్డు విషయానికి వస్తే.. భూర్కపల్లి వాగు వంతెన వరకు రహదారి విస్తరణ పనులు చేపట్టనున్నారు. ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న రహదారిని 4 వరుసలుగా విస్తరించి.. మధ్యలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తారు. ఈ రహదారుల వెడల్పుకు ప్రత్యేక చొరవ చూపినందుకు గాను మంత్రి సీతక్కకు జిల్లా కాంగ్రెస్ నేతలు, ప్రజలు ధన్యవాదాలు తెలుపుతున్నారు.
తెలంగాణలో నేషనల్ హైవేల నిర్మాణంలో ఎదురవుతున్న ఇబ్బందులు, సమస్యలపై రాష్ట్రప్రభుత్వంతో చర్చించేందుకు గాను నేడు అనగా సోమవారం నాడు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు .. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో రోడ్ల నిర్మాణానికి అవసరమైన భూమి సేకరణ, యుటిలిటీ ఛార్జీలు, అటవీ శాఖ నుంచి అనుమతులు వంటి అనేక సమస్యలపై చర్చించనున్నారు. అలానే హైదరాబాద్ ట్రిపుల్ ఆర్, ఫ్యూచర్ సిటీ-ఏపీ రాజధాని అమరావతి వరకు నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే వంటి భవిష్యత్తు ప్రాజెక్టులపై కూడా చర్చించనున్నట్లు సమాచారం. కొన్ని రోజుల క్రితమే సీఎం రేవంత్ రెడ్డి.. హైదరాబాద్-అమరావతి ఎక్స్ప్రెస్ వేపై చర్చించేందుకు కేంద్ర మంత్రి గడ్కరీని కలిశారు. విభజన హామీల్లో భాగంగా తెలంగాణ, ఏపీ మధ్య 12 వరుసల హైవే నిర్మించాలని రేవంత్ రెడ్డి కోరిన సంగతి తెలిసిందే.