|
|
by Suryaa Desk | Mon, Sep 15, 2025, 07:31 PM
తెలంగాణ రైతులు ఎరువుల కోసం ఎంత ఇబ్బందులు పడుతున్నారో మనందరికీ తెలిసిందే. యూరియా, డిఏపీ లాంటి రసాయన ఎరువులు సమయానికి అందకపోతే పంటలు నష్టపోతాయి. కానీ రైతుల బాధలు తగ్గించే ఒక చిన్న మొక్క ఉందని చెబితే నమ్మగలరా..? అదే అజొల్లా. ఈ మొక్క సాధారణంగా నాచులా కనిపిస్తుంది. కానీ దీని ఉపయోగాలు రైతులకు అమూల్యం. నీటిలో తేలుతూ పెరిగే ఈ పచ్చటి మొక్క గాలిలోని నత్రజనిని తనలో దాచుకుని నేలకి సహజ ఎరువులా అందిస్తుంది. రసాయన ఎరువులు కొనడానికి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా.. పొలాల్లోనే ఉచితంగా అవసరమైన పోషకాలు లభిస్తాయి. అందుకే అజొల్లాను రైతులు ‘పచ్చ బంగారం’ అంటారు.
ఒక ఎకరంలో వరి పంట వేసే రైతు కేవలం ఒక కిలో అజొల్లా విత్తనాలు చల్లితే వారం రోజుల్లోనే ఆ పొలం అంతా ఆకుపచ్చగా మారిపోతుంది. ఆ తరువాత ప్రతిరోజూ టన్నుల కొద్దీ ఎరువుల్లాంటి పోషకాలు నేలకు అందుతాయి. ఒక ఏడాదిలో దాదాపు 450 కేజీల నత్రజని ఉచితంగా అందినట్టే. అంటే అదనంగా ఎరువులు కొనాల్సిన పనిలేదన్నమాట. అంతేకాదు.. అజొల్లా వల్ల కలుపు మొక్కలు పెరగవు, దోమలు దరిచేరవు. రైతు ఖర్చు తగ్గి, దిగుబడి సుమారు 20 శాతం పెరుగుతుంది.
పంటలకే కాదు.. పశువులకి కూడా అజొల్లా చాలా మేలు చేస్తుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ఆవులు, గేదెలు, కోళ్లు, చేపలు, మేకలు దీన్ని ఇష్టంగా తింటాయి. వీటిలో ప్రొటీన్లు, అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉండటంతో పశువుల పెరుగుదల వేగంగా జరుగుతుంది. దాణా ఖర్చు దాదాపు 60 శాతం తగ్గుతుంది. ఒక కిలో బయట దాణా ధర 80 రూపాయలు అయితే.. అజొల్లా పెంచడానికి రూపాయి లోపే సరిపోతుంది.
దీనిని ఇంటి పెరట్లో, డాబాపై, చిన్న కుంటల్లో లేదా కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. అందుకే కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల్లో దీన్ని రైతులు పెద్దఎత్తున ఉపయోగిస్తున్నారు. తెలంగాణలో కూడా కామారెడ్డి, చిత్తూరు ప్రాంతాల్లో కొంతమంది రైతులు దీనిని దాణా, ఎరువు కోసం వాడుతున్నారు.
ఇక స్టార్టప్ కంపెనీలు దీన్ని రెడీమేడ్ ఎరువులా అమ్ముతున్నాయి. మరికొన్ని దీన్ని జీవ ఇంధనంగా మార్చి పరిశ్రమలకు అందిస్తున్నాయి. ప్రభుత్వాలు కూడా రైతులను ప్రోత్సహిస్తూ అజొల్లా సాగుకు విత్తనాలు, ప్లాస్టిక్ షీట్ల కొనుగోళ్లపై సబ్సిడీలు ఇస్తున్నాయి. చిన్న మొక్క అయినా.. రైతుల ఖర్చు తగ్గించి, పంటలకు ఎరువుల్లా మారి, పశువులకు పోషకాహారంగా ఉపయోగపడుతున్న అజొల్లా నిజంగా ఒక అద్భుతమే.