|
|
by Suryaa Desk | Mon, Sep 15, 2025, 07:28 PM
తెలంగాణలో ట్రాఫిక్ ఉల్లంఘనల కారణంగా కోట్ల రూపాయల విలువైన ఛలాన్లు జారీ అవుతున్నా.. వాటిలో పెద్ద భాగం ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో మూడు కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాదిలోనే లక్షల సంఖ్యలో ఛలాన్లు విధించారు. అయితే గత ఏడాది (2023 డిసెంబర్ నుంచి 2024 ఫిబ్రవరి వరకు) ప్రభుత్వం ప్రత్యేక డిస్కౌంట్ స్కీమ్ అమలు చేయడంతో కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలు క్లియర్ అయ్యాయి. ఈ స్కీమ్ ద్వారా దాదాపు 1.67 కోట్ల ఛలాన్లు తేలిపోయి.. ప్రభుత్వానికి 150 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వచ్చింది.
ఈసారి కూడా ఇలాంటి రాయితీ వస్తుందేమో అని వాహనదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే వేల కోట్ల రూపాయల విలువైన ఛలాన్లు ఇంకా పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి అధికారిక స్పష్టత ఇవ్వలేదు. కొందరు వాహనదారులు ఈ ఏడాది డిసెంబర్ చివర్లోనైనా రాయితీ ప్రకటిస్తారేమో అని ఎదురు చూస్తున్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే అక్కడ కూడా లక్షల సంఖ్యలో ఛలాన్లు జారీ అయ్యాయి. 2025 ఆగస్టు 31 నాటికి ఏపీలో 48 లక్షలకు పైగా ఛలాన్లు ఇచ్చారు. వీటిలో 31 లక్షలకు పైగా ఇంకా చెల్లించలేదు. వాటి విలువ 60 కోట్లకు పైగానే ఉంది. అయితే ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ట్రాఫిక్ ఉల్లంఘనలపై విధించే ఫైన్లలో తేడా ఉంది. ఉదాహరణకు.. హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తే ఏపీలో వెయ్యి రూపాయల ఫైన్ వేస్తారు. కానీ తెలంగాణలో అది 200 రూపాయలే. వాహనం నడుపుతూ మొబైల్తో మాట్లాడితే ఏపీలో 5 వేల వరకు ఫైన్ వేస్తే.. తెలంగాణలో 1000 రూపాయలే.
రెండు రాష్ట్రాల్లో కూడా సీసీ కెమెరాలు, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ వంటి టెక్నాలజీ వాడుతున్నా.. పెండింగ్ ఛలాన్లు పెద్ద భారంగా మారుతున్నాయి. ఏపీలో లోక్ అదాలత్ వంటి అవకాశాలు ఇవ్వడం జరుగుతుంటే.. తెలంగాణలో మాత్రం వాహనదారులు మళ్లీ డిస్కౌంట్ వస్తుందేమో అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాయితీ ప్రకటించడం వాహనదారులకు ఉపశమనం కలిగిస్తే.. ప్రభుత్వానికి కూడా పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. అయినా సరే.. ఎప్పుడెప్పుడు డిస్కౌంట్ ఇస్తారోనని వాహనదారుల ఎదురుచూపులు కొనసాగుతూనే ఉన్నాయి.