![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jul 05, 2025, 08:46 PM
హైదరాబాద్ నగరంలోని ఓ బస్తీలో నెలకొన్న దుస్థితిపై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యంపై తీవ్రస్థాయిలో మండిపడిన ఆయన, జీహెచ్ఎంసీ కమిషనర్పై ఫోన్లోనే ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లోగా సమస్యను పరిష్కరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని శ్రీకృష్ణనగర్ బస్తీలో కిషన్ రెడ్డి శనివారం నాడు పర్యటించారు. ఈ సందర్భంగా సీ-బ్లాక్లోని కమ్యూనిటీ హాల్ వద్ద ఇళ్ల ముందు మురుగునీరు ఏరులై పారుతుండటాన్ని గమనించారు. రోజుల తరబడి ఇదే పరిస్థితి కొనసాగుతోందని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆయన ఎదుట వాపోయారు.ప్రజల ఇబ్బందులను చూసి చలించిపోయిన కిషన్ రెడ్డి, అక్కడి నుంచే జీహెచ్ఎంసీ కమిషనర్కు ఫోన్ చేశారు. "మీ ఇంటి ముందు ఇలా మురుగునీరు ప్రవహిస్తుంటే ఒక్క నిమిషమైనా ఉండగలరా?" అని తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. అధికారుల తీరు ఏమాత్రం బాగోలేదని అసహనం వ్యక్తం చేశారు. తక్షణమే చర్యలు చేపట్టి, వారం రోజుల్లోగా ఈ మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గడువు విధించారు.