![]() |
![]() |
by Suryaa Desk | Fri, May 23, 2025, 07:26 PM
తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసినట్లుగా చెబుతున్న ఒక లేఖ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ఈ లేఖలోని అంశాలు బీఆర్ఎస్ పార్టీ అంతర్గత పరిస్థితులు, భవిష్యత్ వ్యూహాలపై అనేక ఊహాగానాలకు తావిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో.. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి మరింత ఆజ్యం పోశాయి. ప్రస్తుతం కవిత అమెరికాలో ఉండగా.. ఆమె స్వదేశానికి తిరిగి రాగానే ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు ఈ లేఖపై అధికారికంగా మౌనం వహించడం, ప్రత్యర్థి పార్టీలకు అస్త్రంగా మారింది. కాంగ్రెస్, బీజేపీలు ఈ లేఖను అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ పై విరుచుకు పడుతున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనేందుకు ఈ లేఖే సాక్ష్యం అంటూ కాంగ్రెస్ క్లెయిమ్ చేసుకుంటుంది. బీఆర్ఎస్లో కుటుంబ పంచాయతీ తారాస్థాయికి చేరిందంటూ కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఇటు బీజేపీ కూడా కవిత కాంగ్రెస్ ‘ఫోన్’లో ఉందని, రేవంత్ రెడ్డే ఈ లేఖను రాయించారని సంచలన ఆరోపణలు చేస్తోంది. కవిత మరో షర్మిలగా మారబోతోందంటూ రాజకీయ జోస్యం చెబుతున్నారు.
ఈ మొత్తం పరిణామాలపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత మరో షర్మిల కాబోతోందని ఆయన అన్నారు. బీఆర్ఎస్ లో జరుగుతున్న కుటుంబ కలహాల నేపథ్యంలో కవిత కాంగ్రెస్ శిబిరంలోకి వెళ్ళే అవకాశం ఉందని రఘునందన్ రావు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా.. ఈ లేఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే కవితతో రాయించి ఉండవచ్చని ఆయన ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనే తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి రేవంత్ రెడ్డి గతంలోనూ ప్రయత్నించారని రఘునందన్ గుర్తు చేశారు.
ఇందులో భాగంగానే కవితతో త్వరలోనే ఒక కొత్త పార్టీని పెట్టించి.. ఆ తర్వాత షర్మిల పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసుకున్నట్లుగానే కవిత పార్టీని కూడా కాంగ్రెస్లో కలిపేసుకుంటారని రఘునందన్ రావు జోస్యం చెప్పారు. గత ప్లీనరీలో కేసీఆర్ తన రాజకీయ వారసుడిగా కేటీఆర్ను పరోక్షంగా ప్రకటించిన సందర్భంలో.. కవిత కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోందని ఆయన అన్నారు. కవిత రాసిన ఈ లేఖ.. అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక టీవీ ఛానెల్లో, ఒక పేపర్లో ప్రముఖంగా కనిపించడం వెనుక ఒక కుట్ర కోణం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
ఈ పరిణామాల తర్వాత కేటీఆర్, హరీష్రావు ఒకటయ్యారనే మెసేజ్ను బయటకు పంపడం, కవితను ఒంటరిని చేస్తున్నారనే భావన కలిగిన తర్వాతే ఆమె కాంగ్రెస్ వైపు వెళ్లి ఉండవచ్చని తెలంగాణ ప్రజలు అనుమానిస్తున్నారని రఘునందన్ రావు పేర్కొన్నారు. బీజేపీ ఈ రాష్ట్రంలో బలపడుతోందని, అధికారంలోకి రాబోతోందని బీఆర్ఎస్, కవితలే చెప్పకనే చెబుతున్నారని తాము భావిస్తున్నామని రఘునందన్ రావు అన్నారు.
ఈ లేఖ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. లేఖ ప్రామాణికతపై స్పష్టత లేనప్పటికీ.. దాని చుట్టూ అల్లుకున్న రాజకీయ కథనాలు, ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీని, ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబాన్ని తీవ్ర ఒత్తిడిలోకి నెడుతున్నాయి. కల్వకుంట్ల కుటుంబం ఈ వివాదంపై స్పందిస్తేనే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అప్పటివరకు ఈ లేఖ తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగానే కొనసాగుతుంది.. భవిష్యత్ రాజకీయ పరిణామాలపై ప్రభావం చూపుతుంది.