![]() |
![]() |
by Suryaa Desk | Fri, May 23, 2025, 07:16 PM
హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న సంధ్య థియేటర్లో ఇటీవల జరిగిన తొక్కిసలాట, దానికి సంబంధించిన పోలీసుల నిర్లక్ష్యంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్షీ) మరోసారి తీవ్రంగా స్పందించింది. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన ఈ దుర్ఘటనలో దిల్సుఖ్నగర్కు చెందిన రేవతి (39) మరణించగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ (9) తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి సమగ్ర నివేదికను ఆరు వారాల్లోగా సమర్పించాలని గురువారం హైదరాబాద్ సిటీ సీపీ సీవీ ఆనంద్కు ఎన్హెచ్ఆర్సీ నేరుగా నోటీసులు జారీ చేసింది.
ఈ దుర్ఘటనపై జనవరిలో న్యాయవాది ఇమ్మనేని రామారావు ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. అప్పుడే ఈ ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని చిక్కడపల్లి ఏసీపీకి, జోన్ డీసీపీకి కమిషన్ నోటీసులు పంపింది. అయితే, పోలీసులు సమర్పించిన ప్రాథమిక నివేదికలో సరైన వివరాలు లేవని.. నిబద్ధత లోపించిందని ఎన్హెచ్ఆర్సీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నివేదికను తిరస్కరిస్తూ.. పోలీసులు మరోసారి మొట్టికాయలు వేయడం గమనార్హం.
పోలీసులు తమ నివేదికలో అల్లు అర్జున్ వచ్చేందుకు అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు. దీనిపై ఎన్హెచ్ఆర్సీ నిశితంగా ప్రశ్నించింది. ‘పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో ఉన్న థియేటర్ దగ్గర డీజేలు పెట్టి, పెద్ద ఎత్తున హంగామా చేస్తుంటే పోలీసులు ఎందుకు పట్టించుకోలేదు..? అనుమతి నిరాకరించినప్పుడు ప్రీమియర్ షో సమయంలో అల్లు అర్జున్ అక్కడికి ఎలా వచ్చారు..? అంతమంది జనం గుమిగూడినప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారు..?’ అంటూ నివేదికపై ఎన్హెచ్ఆర్సీ ప్రశ్నల వర్షం కురిపించింది. తమకు ఇచ్చిన నివేదికలో కూడా సరైన వివరాలు లేవని.. పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా అర్థమవుతోందని కమిషన్ తీవ్రంగా పేర్కొంది.
సంధ్య థియేటర్ లైసెన్స్ రద్దుకై.. పోలీసులు షోకాజ్ నోటీసులు
ఈ తొక్కిసలాట పోలీసుల లాఠీచార్జి వల్ల జరగలేదని.. అల్లు అర్జున్ రావడం వల్లే జరిగిందని పోలీసులు తమ నివేదికలో చెప్పడంపై కూడా ఎన్హెచ్ఆర్సీ సందేహాలు వ్యక్తం చేసింది. ఒక స్టార్ హీరో రాకను నియంత్రించడంలో.. భారీ జనసమూహాన్ని పర్యవేక్షించడంలో పోలీసులు విఫలమయ్యారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రజల భద్రతను నిర్లక్ష్యం చేయడం, ఒక చిన్నపాటి ఘటన విషాదంగా మారడానికి కారణం కావడంపై ఎన్హెచ్ఆర్సీ దృష్టి సారించింది.
పౌరుల ప్రాణాలను రక్షించడం, అలాంటి సందర్భాలలో తగిన భద్రతా ఏర్పాట్లు చేయడంలో పోలీసుల బాధ్యతను ఈ ఘటన గుర్తు చేసింది. అందుకే, ప్రాథమిక నివేదికపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. నేరుగా సిటీ సీపీకి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికైనా ఈ ఘటనపై అన్ని కోణాల నుంచి సమగ్ర విచారణ జరిపి.. ఆరు వారాల్లోగా పూర్తి నివేదికను అందించాలని కమిషన్ ఆదేశించింది. ఈ నివేదిక ఆధారంగా కమిషన్ తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.