![]() |
![]() |
by Suryaa Desk | Wed, May 21, 2025, 03:10 PM
పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి ఘటనపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరోసారి కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సరైన భద్రత కల్పించకపోవడం వల్లే ఈ దారుణం జరిగిందని ఆయన ఆరోపించారు. ఉగ్రదాడికి సంబంధించి నిఘా వర్గాల నుంచి ముందే సమాచారం అందినందువల్లే ప్రధాని మోదీ తన కశ్మీర్ పర్యటనను రద్దు చేసుకున్నారని ఖర్గే పునరుద్ఘాటించారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది.కర్ణాటక ప్రభుత్వ రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా విజయనగర జిల్లా హోసాపేటలో జరిగిన కార్యక్రమంలో మల్లికార్జున ఖర్గే ప్రసంగించారు. పహల్గామ్ వెళ్లిన పర్యాటకులకు పోలీసులు, బీఎస్ఎఫ్ లేదా సైన్యం నుంచి ఎలాంటి భద్రత కల్పించలేదని, దీని ఫలితంగానే 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత పెద్ద ఘటన జరిగినా, భద్రతా వైఫల్యంపై ప్రధాని మోదీ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం దారుణమని విమర్శించారు.పాకిస్థాన్తో మనం చిన్నపాటి యుద్ధాలు చేస్తున్నామని, అయితే పాక్ మనల్ని తక్కువ అంచనా వేస్తూ, చైనా మద్దతుతో దాడులకు ప్రయత్నిస్తోందని ఆయన మండిపడ్డారు. ఇలాంటి దాడులను దేశం ఎప్పటికీ సహించబోదని స్పష్టం చేశారు. ఈ విషయంలో దేశమంతా ఐక్యంగా ఉందని, దేశ వ్యతిరేక శక్తులపై పోరాటంలో ప్రభుత్వానికి తాము మద్దతు ఇస్తున్నామని తెలిపారు. దేశమే అన్నింటికన్నా ముఖ్యమని, ఆ తర్వాతే మతం, కులం వంటి అంశాలని అన్నారు.