|
|
by Suryaa Desk | Fri, Oct 17, 2025, 08:30 PM
తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గంలో త్వరలో జరగనున్న ఉప ఎన్నిక దృష్ట్యా అధికార యంత్రాంగం కీలక ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ల అంశంపై నిరసనలు జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన పోలింగ్ నవంబర్ 11వ తేదీన జరగనుంది. ఈ సందర్భంగా ఆ నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రస్తుతం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. షేక్పేట తహసీల్దార్ కార్యాలయంలో ఈ నెల 21 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు తీసుకుంటారు. 22న నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. 24 వరకు ఉపసంహరణకు గడువు ఉంది. నవంబర్ 11న పోలింగ్ నిర్వహించి, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరపనున్నారు. సెలవు రోజులు మినహా మిగిలిన పనిదినాల్లో నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. అభ్యర్థులు కార్యాలయంలో నేరుగా లేదా డిజిటల్ పద్ధతిలో కూడా నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ సంఘం అక్టోబర్ 18వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చింది. స్కూల్స్, కాలేజీలతో పాటు.. పెట్రోల్ బంక్ లు కూడా బంద్ పాటించనున్నాయి. రేపు ఒక్క మెడికల్ షాపులు మినహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని షాపులు మూసివేయనున్నారు. ఈ నేపథ్యంలో డీజీపీ శివధర్రెడ్డి శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా బంద్ను శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. నిఘా బృందాలు, పోలీస్ సిబ్బంది ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించారు. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు.
అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ ..
ఈ బంద్కు రాజకీయ పార్టీలు, ఎస్సీ, ఎస్టీ బీసీ సంఘాల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. బషీర్బాగ్ నుంచి లోయర్ ట్యాంక్బండ్లోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మందకృష్ణ మాదిగ, జాజుల శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ కోదండరాం, అద్దంకి దయాకర్ వంటి ముఖ్య నాయకులు పాల్గొన్నారు. బీసీ జేఏసీ బంద్ను విజయవంతం చేయాలని ప్రజలను కోరింది.