|
|
by Suryaa Desk | Fri, Aug 01, 2025, 07:43 PM
ప్రభుత్వ ఉద్యోగుల హాజరు పర్యవేక్షణ కోసం కొత్త టెక్నాలజీలు వచ్చినా.. కొందరు ఉద్యోగులు వాటిని కూడా మోసం చేయడానికి కొత్త దారులు వెతుకుతున్నారు. తాజాగా.. ఒక ప్రభుత్వ ఉద్యోగి తన అటెండెన్స్ వేసుకోవడానికి ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోను ఉపయోగించుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఇలా రోజూ ఒకే ఫోటో అప్లోడ్ చేస్తుండటంతో అధికారులకు అనుమానం వచ్చి తనిఖీలు చేపట్టారు. దీంతో ఆ ఉద్యోగి చేసిన పని బయటపడింది.
డిజిటల్ అటెండెన్స్లో మోసాలు..
ఈ ఘటన జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చందయాపల్లి గ్రామ పంచాయతీలో జరిగింది. అక్కడి పంచాయతీ కార్యదర్శి రాజన్న, విధులకు హాజరు కాకుండా, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫేషియల్ రికగ్నిషన్ యాప్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోను అప్లోడ్ చేసి తన హాజరును నమోదు చేసుకుంటున్నాడు. పంచాయతీ కార్యదర్శుల హాజరును పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ఈ మొబైల్ యాప్ను తీసుకొచ్చింది. దీని ప్రకారం, ఉద్యోగులు తాము విధులు నిర్వహిస్తున్న గ్రామాల నుంచే ఈ యాప్ ద్వారా అటెండెన్స్ వేసుకోవాలి.
అయితే.. కొందరు ఉద్యోగులు రోజూ ఒకే ఫోటోను అప్లోడ్ చేస్తుండటంతో అధికారులకు అనుమానం వచ్చింది. వెంటనే తనిఖీలు చేపట్టగా.. జగిత్యాల జిల్లాలో రాజన్న నిర్వాకం చూసి అధికారులు అవాక్కయ్యారు. సీఎం ఫోటోతో అటెండెన్స్ వేసుకుంటున్న విషయాన్ని గుర్తించి షాక్కు గురయ్యారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి పంచాయతీ కార్యదర్శి రాజన్నను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఒక్క రాజన్న ఘటనే కాదు, అటెండెన్స్ విషయంలో మరికొందరు ఉద్యోగులు కూడా అక్రమాలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. కొందరు ఉద్యోగులు అసలు విధులకు వెళ్లకుండానే, ఇతరుల సహాయంతో తాము లేకుండానే హాజరు నమోదు చేసుకుంటున్నారు. ఇంకొందరు మరింత తెలివిగా.. ఖాళీ కుర్చీల ఫోటోలు పెట్టి అటెండెన్స్ వేసుకుంటున్నట్లు తేలింది. ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న ఉద్యోగులందరిపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
ప్రభుత్వ వ్యవస్థలో పారదర్శకతను పెంచడానికి, ఉద్యోగుల బాధ్యతను పెంపొందించడానికి ప్రభుత్వం డిజిటల్ హాజరు విధానాన్ని ప్రవేశపెట్టినా, దాన్ని కూడా మోసం చేయడానికి కొన్ని శక్తులు ప్రయత్నించడం విచారకరం. ఇలాంటి చర్యలు ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించడంలో జాప్యాన్ని కలిగించడమే కాకుండా.. వ్యవస్థపై నమ్మకాన్ని కూడా దెబ్బతీస్తాయి. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలకు అవకాశం లేకుండా మరింత పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇదిలా ఉండగా.. గత జూన్ నెలలో పంచాయతీ కార్యదర్శులు ఈ యాప్ గోప్యతకు భంగం, పనిభారం పెంచుతుందని వారు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.