|
|
by Suryaa Desk | Mon, Jun 30, 2025, 05:08 PM
తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికపై నెలకొన్న ఉత్కంఠ నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఒక ప్రజాస్వామ్యయుతమైన పార్టీ అని, అయితే అధ్యక్షుడి ఎంపికపై అధిష్ఠానం నిర్ణయమే అంతిమమని ఆయన స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్, నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పార్టీలో ఎవరైనా నామినేషన్ దాఖలు చేయవచ్చని, కానీ చివరకు పార్టీ అధిష్ఠానం ఎవరి పేరును ఖరారు చేస్తే వారే బాధ్యతలు స్వీకరిస్తారని బండి సంజయ్ తెలిపారు. "బీజేపీలో ఎవరో చెబితే అధ్యక్షులను నియమించరు. అధిష్ఠానం అధికారికంగా ప్రకటించేంత వరకు వేచి చూడాలి. పార్టీ కార్యకర్తలంతా అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటారు" అని ఆయన అన్నారు.పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి, వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే బీసీలకు చెందిన వ్యక్తినే ముఖ్యమంత్రిని చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీని ఆయన తీవ్రంగా విమర్శించారు."గతంలో దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇచ్చి బీఆర్ఎస్ మాట తప్పింది. ప్రజలను మోసం చేసింది. మరి ఇప్పుడు బీసీలకు ముఖ్యమంత్రి పదవి లేదా పార్టీ అధ్యక్ష పదవి ఇస్తామని ప్రకటించే దమ్ము ఆ పార్టీకి ఉందా" అని ఆయన సవాల్ విసిరారు.