![]() |
![]() |
by Suryaa Desk | Fri, May 23, 2025, 06:29 PM
ప్రపంచవ్యాప్తంగా తీవ్రమవుతున్న వాతావరణ మార్పులు, తరచూ సంభవిస్తున్న ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో, వీటిని ముందుగానే కచ్చితత్వంతో అంచనా వేయగల సాంకేతికతకు ప్రాధాన్యత పెరుగుతోంది. ఈ దిశగా మైక్రోసాఫ్ట్ పరిశోధకులు 'అరోరా' అనే ఒక సరికొత్త కృత్రిమ మేధ (ఏఐ) నమూనాని అభివృద్ధి చేశారు. ఇది కేవలం వాతావరణాన్నే కాకుండా, వాయు కాలుష్యం, సముద్రపు అలల ఉద్ధృతి వంటి పలు పర్యావరణ అంశాలను కూడా అత్యంత కచ్చితంగా, వేగంగా అంచనా వేయగలదని 'నేచర్' జర్నల్లో ప్రచురించిన ఓ అధ్యయనంలో వెల్లడించారు.అరోరా అనేది ఒక 'ఫౌండేషన్ మోడల్'. అంటే, విస్తృతమైన సమాచారంతో దీనికి శిక్షణ ఇచ్చి, ఆ తర్వాత నిర్దిష్టమైన పనుల కోసం మరింత మెరుగ్గా తీర్చిదిద్దవచ్చు. దాదాపు పది లక్షల గంటల పాటు ఉపగ్రహాలు, రాడార్లు, వాతావరణ కేంద్రాల నుంచి సేకరించిన సమాచారం, ఎన్నో దశాబ్దాలుగా సేకరించిన డేటా, గత వాతావరణ నమూనాలు, అంచనాలతో అరోరాకు శిక్షణ ఇచ్చారు. ఇంత భారీ డేటాతో ఏఐ వాతావరణ నమూనాకు శిక్షణ ఇవ్వడం ఇదే తొలిసారని మైక్రోసాఫ్ట్ పరిశోధకులు తెలిపారు.