|
|
by Suryaa Desk | Mon, May 19, 2025, 03:37 PM
కొన్ని వైవిధ్యమైన పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న నటి పూనమ్ కౌర్, సినిమాల కంటే ఎక్కువగా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు. పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్లను ఉద్దేశించి గతంలో పరోక్షంగా ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు చర్చనీయాంశంగా మారాయి. తాజాగా పూనమ్ కౌర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.హైదరాబాద్లో జరిగిన తెలుగు వన్ డిజిటల్ మీడియా సంస్థ వజ్రోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులతో పాటు నటి పూనమ్ కౌర్ కూడా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఒక ప్రత్యేకమైన కానుకను అందజేశారు. అమరావతి అభివృద్ధిని ప్రతిబింబించేలా, కలల రాజధానిగా అమరావతి రూపుదిద్దుకుంటున్న తీరును వివరిస్తూ రూపొందించిన ఒక కళాకృతిని ఆమె చంద్రబాబుకు బహూకరించారు. కళ, కథనం, భావోద్వేగాల సమ్మేళనంగా ఉన్న ఆ ఆర్ట్ వర్క్ను సీఎం చంద్రబాబు ఆసక్తిగా తిలకించారు.అయితే, చాలా రోజుల తర్వాత ఈ కార్యక్రమంలో కనిపించిన పూనమ్ కౌర్, కాస్త బొద్దుగా, ఏదో అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు కనిపించారు. దీంతో ఆమె ఆరోగ్యంపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు మొదలయ్యాయి. ఈ వార్తల నేపథ్యంలో పూనమ్ కౌర్ తన ఆరోగ్యం గురించి స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం తన ఆరోగ్యం అంత బాగా లేదని, ఫుడ్ ఎలర్జీతో బాధపడుతున్నానని ఆమె తెలిపారు. అంతేకాకుండా, ఫైబ్రోమయాల్జియా అనే వ్యాధితో తాను ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని పూనమ్ పేర్కొన్నారు. ఈ ఆరోగ్య సమస్యల కారణంగానే తన శరీరం ఉబ్బినట్లు కనిపిస్తోందని ఆమె వివరించారు. పూనమ్ వ్యాఖ్యల నేపథ్యంలో, ముందుగా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పలువురు నెటిజన్లు ఆమెకు సూచిస్తున్నారు.
Latest News