|
|
by Suryaa Desk | Thu, Oct 30, 2025, 07:25 PM
బీసీలకు రాజ్యాధికారం కల్పించడమే తన జీవితంలో చివరి కోరిక అని బీసీ సంఘాల నేత, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య అన్నారు. రిజర్వేషన్లు సాధించే వరకు తమ పోరాటం ఆగదని, ఈ ఉద్యమం తెలంగాణ నుంచే ప్రారంభమైందని ఆయన స్పష్టం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.ఇటీవల నిర్వహించిన 'బీసీ బంద్' సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 350 మందిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఆర్. కృష్ణయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు. బీసీల హక్కుల కోసం శాంతియుతంగా పోరాడుతున్న వారిని అరెస్టు చేయడం సరికాదని మండిపడ్డారు.బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించడమే లక్ష్యంగా తన నాయకత్వంలో బీసీ జేఏసీని ఏర్పాటు చేసినట్లు ఆయన గుర్తుచేశారు. ఈ లక్ష్యం నెరవేరేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. బీసీల ఐక్యతతోనే రాజ్యాధికారం సాధ్యమవుతుందని కృష్ణయ్య అభిప్రాయపడ్డారు