|
|
by Suryaa Desk | Sat, Oct 04, 2025, 04:43 PM
ప్రేమించి, పెద్దలను ఒప్పించి ఒక్కటైన ఓ జంట జీవితంలో పెళ్లైన ఆరు రోజులకే పెను విషాదం చోటుచేసుకుంది. భర్తతో జరిగిన చిన్నపాటి గొడవ కారణంగా నవవధువు ఆత్మహత్యకు పాల్పడిన హృదయవిదారక ఘటన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో వెలుగుచూసింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామానికి చెందిన అల్లెపు గంగోత్రి (22), అదే గ్రామానికి చెందిన సంతోష్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి, వారి సమక్షంలోనే గత నెల 26న వీరి వివాహం ఘనంగా జరిగింది. ఎంతో సంతోషంగా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారనుకున్న వారి కాపురంలో అనుకోని కుదుపు ఎదురైంది.దసరా పండుగ సందర్భంగా ఈ నెల 2న గంగోత్రి తన భర్త సంతోష్తో కలిసి పుట్టింటికి వెళ్లింది. అయితే, ఆ రోజు రాత్రి భోజన సమయంలో దంపతుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం ఇద్దరూ కలిసి అత్తగారింటికి తిరిగి వెళ్లారు. అదే రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంట్లో వారంతా నిద్రపోతున్న సమయంలో గంగోత్రి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది.భర్తతో జరిగిన గొడవే తమ కుమార్తె ఆత్మహత్యకు కారణమై ఉంటుందని, అత్తింటిలో ఇంకేమైనా జరిగి ఉండవచ్చని మృతురాలి తల్లి శారద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి ఆరు రోజులకే ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.