|
|
by Suryaa Desk | Mon, Sep 15, 2025, 04:20 PM
ఒక ఇంట్లో ఉన్నప్పుడు చిన్నచిన్న గొడవలు సహజం. వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవాలి కానీ, బజారున పడి కొట్లాడుకోవద్దు. కలిసికట్టుగా పనిచేయాలి" అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. జూబ్లీహిల్స్లో పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ నగరం అనాథగా మారిందని, నగరాన్ని పట్టించుకునే నాథుడే కరవయ్యాడని తీవ్రంగా ధ్వజమెత్తారు. వర్షాలకు నగరంలో ముగ్గురు యువకులు కొట్టుకుపోయి మరణిస్తే వారిని పరామర్శించేందుకు ఒక్క మంత్రి కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం ముగ్గురు మంత్రులను నియమించిన ప్రభుత్వం, వర్షాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజల కోసం ఎందుకు స్పందించడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. తాము 36 ఫ్లైఓవర్లు నిర్మిస్తే, ప్రస్తుత ప్రభుత్వం కనీసం రోడ్ల మీద గుంతలు కూడా పూడ్చలేని దుస్థితిలో ఉందని విమర్శించారు.రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని, నేరాల రేటు 41 శాతం పెరిగిందని ఆరోపించారు. చందానగర్లో పట్టపగలే ఒక నగల దుకాణంలో దోపిడీ జరగడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభించిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తాము కొనసాగిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు లేవని చెప్పి దాన్ని మూసివేసిందని కేటీఆర్ మండిపడ్డారు.