![]() |
![]() |
by Suryaa Desk | Wed, May 21, 2025, 05:12 PM
శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం ప్రమాదం జరిగి మూడు నెలలు కావస్తున్నా, అందులో చిక్కుకుపోయిన కార్మికుల మృతదేహాలను వెలికితీయడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారుపై ఆయన ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు.ఈ ఏడాది ఫిబ్రవరి 22న ఎస్ఎల్బీసీ సొరంగం నిర్మాణంలో ప్రమాదం చోటుచేసుకుని, ఎనిమిది మంది కార్మికులు లోపల చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. వీరిలో ఇద్దరి మృతదేహాలను మాత్రమే వెలికితీయగలిగారు. మిగిలిన ఆరుగురి ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. సుమారు 58 రోజుల పాటు సహాయక చర్యలు కొనసాగించినప్పటికీ, ఫలితం లేకపోవడంతో ప్రభుత్వం వాటిని తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో, మిగిలిన కార్మికుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.ఈ ఘటనపై కేటీఆర్ తాజాగా స్పందిస్తూ, "సమర్థవంతమైన నాయకత్వం ఉంటే మూడు నెలల్లో అంగారక గ్రహం నుంచి మనుషులను తీసుకురావొచ్చు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సొరంగంలో చిక్కుకున్న మృతదేహాలను కూడా బయటకు తీసుకురాలేకపోయింది. రేవంత్ రెడ్డి గారూ, మీకు సిగ్గుగా లేదా అంటూ తన ట్వీట్లో ఘాటుగా ప్రశ్నించారు. ప్రమాదం జరిగి మూడు నెలలు గడిచినా, మృతదేహాలను వెలికితీయకపోవడం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమని ఆయన ఆరోపించారు.బాధిత కుటుంబాలను ఇప్పటివరకు పరామర్శించకపోవడం, వారికి అండగా నిలవకపోవడం సీఎం రేవంత్ రెడ్డికి మానవత్వం లేదనడానికి నిదర్శనమని కేటీఆర్ విమర్శించారు. తక్షణమే బాధిత కుటుంబాలను కలిసి, వారికి క్షమాపణ చెప్పి, ప్రభుత్వ సాయం అందించాలని డిమాండ్ చేశారు. "ప్రమాదం జరిగే అవకాశం ఉందని తెలిసినా, కేవలం కమిషన్ల కోసమే కుటుంబాలను బలిచేశారు" అని కూడా ఆయన ఆరోపించారు.