![]() |
![]() |
by Suryaa Desk | Wed, May 21, 2025, 04:59 PM
పాకిస్థాన్కు మద్దతు తెలుపుతోందన్న కారణంతో టర్కీ నుంచి యాపిల్ పండ్ల దిగుమతిని తక్షణమే నిషేధించాలని హిమాచల్ ప్రదేశ్ పండ్ల ఉత్పత్తిదారుల సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు హిమాచల్ ప్రదేశ్ పండ్ల ఉత్పత్తిదారుల సంయుక్త్ మంచ్ (హిమాచల్ ఫ్రూట్ గ్రోయర్స్) ప్రతినిధులు రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ద్వారా రాష్ట్రపతి, ప్రధానమంత్రి కార్యాలయాలకు ఒక వినతి పత్రాన్ని అందజేశారు.'ఆపరేషన్ సిందూర్' సమయంలో పాకిస్థాన్కు టర్కీ బహిరంగంగా మద్దతు తెలపడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పండ్ల ఉత్పత్తిదారుల సంఘం తమ ప్రకటనలో పేర్కొంది. "భారత్కు యాపిల్స్ అధికంగా ఎగుమతి చేసే దేశాల్లో టర్కీ కూడా ఒకటి. ప్రతీ సంవత్సరం సుమారు రూ.800 కోట్ల నుంచి రూ.1000 కోట్ల విలువైన యాపిల్స్ను మనం టర్కీ నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. ఉద్రిక్త పరిస్థితుల్లో పాకిస్థాన్కు టర్కీ అండగా నిలవడం దారుణం. 'శత్రువుకు మిత్రుడు మనకు కూడా శత్రువే' అనే సూత్రాన్ని అనుసరించి, టర్కీ నుంచి అన్ని రకాల దిగుమతులపై దేశవ్యాప్తంగా నిషేధం విధించాలి" అని సంఘం తమ వినతిపత్రంలో కోరింది.