|
|
by Suryaa Desk | Sun, Sep 14, 2025, 05:01 PM
హైదరాబాద్లో కలకలం రేపిన ఓల్డ్ బోయిన్పల్లి మేధా స్కూల్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మేధా పాఠశాల అనుమతులను తెలంగాణ విద్యాశాఖ రద్దు చేసింది. మేధా పాఠశాలలో గుట్టుచప్పుడు కాకుండా అల్ప్రాజోలం తయారీ చేస్తోన్న వైనం వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా మేధా స్కూలుకు ఉన్న అనుమతులను తెలంగాణ విద్యాశాఖ రద్దు చేసింది. మేధా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా.. వారిని వేరే పాఠశాలల్లో చేర్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మేధా పాఠశాలపై ఈగల్ టీం దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. స్కూల్లో గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ తయారీ చేస్తున్నారంటూ పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఈగల్ టీమ్ దాడులు నిర్వహించింది. ఈ తనిఖీల్లో స్కూల్లో ఆల్ఫాజోరం తయారు చేసే మెషీన్లను పోలీసులు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. మేధా పాఠశాలకు చెందిన పాత భవనంలో మత్తు పదార్థాల తయారీ జరుగుతున్నట్లు గుర్తించారు. ఈ కేసులో కొంతమందిని అదుపులోకి తీసుకుని ఈ విషయమై విచారిస్తున్నట్లు తెలిసింది. వారి వద్ద నుంచి 7 కిలోల ఆల్ఫాజోరంతో పాటుగా 20 లక్షల రూపాయల నగదు, కల్లులో కలిపే ఓ పౌడర్ను ఈగల్ టీమ్ స్వాధీనం చేసుకుంది.ఈ వ్యవహారంలో మేధా స్కూల్ ప్రిన్సిపల్ కీలక సూత్రధారిగా భావిస్తున్నారు.
మరోవైపు రేపటి పౌరుల భవిష్యత్తును తీర్చిదిద్దే పాఠశాలలో మూడో కంటికి తెలియకుండా ఇలాంటి వ్యవహారం నడిపించటం పోలీసులతో పాటుగా స్థానికులను కూడా విస్మయపరుస్తోంది. తరగతులు నిర్వహిస్తూనే.. స్కూలు సిబ్బందికి, విద్యార్థులకు ఏ మాత్రం అనుమానం రాకుండా ఈ వ్యవహారం నడిపించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పాఠశాల భవనంలోని రెండు గదుల్లో ఈ డ్రగ్స్ తయారీ వ్యవహారం నడుస్తున్నట్లు ఈగల్ టీమ్ గుర్తించింది. పగలు పాఠశాల నిర్వహణ సమయంలో ఎవరికీ అనుమానం రాకుండా ఈ రెండు గదులకూ తాళం వేసేవారని.. స్కూలు ముగిసి, విద్యార్థులు, సిబ్బంది ఇంటికి వెళ్లిన తర్వాత సాయంత్రం నుంచి అల్ప్రాజోలం తయారు చేసేవారని భావిస్తున్నారు.