|
|
by Suryaa Desk | Sat, May 17, 2025, 07:23 PM
సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి ఆలయంలో రంగం భవిష్యవాణి వినిపించే అరుపుల స్వర్ణలతకు రేవంత్ సర్కార్ తీపి కబురు చెప్పింది. ఆమెకు డబుల్ బెడ్ రూం ఇల్లును మంజూరు చేసింది. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ డబుల్ బెడ్ రూం ఇంటి పట్టాను అందజేశారు. ఆమె కోరుకున్న మారేడుపల్లి ప్రాంతంలోనే డబుల్ బెడ్ రూం ఇల్లును ప్రభుత్వం కేటాయించింది. ప్రస్తుతం సికింద్రాబాద్ సమీపంలోని తుకారాంగేట్ ఇరుకు గల్లీలో ఒక చిన్న ఇంట్లో అద్దెకు ఉంటున్న ఆమె.. డబుల్ బెడ్ రూం ఇంటి కోసం పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించుకుంది. ఎట్టకేలకు సర్కార్ ఆమెకు డబుల్ బెడ్ రూం ఇంటిని కేటాయించి పత్రాలు అందజేశారు.
1997 నుంచి నేటి వరకు..
కాగా, సికింద్రాబాద్ ఉజ్జయిని బోనాలు తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన పెద్ద పండుగలలో ఒకటి. ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో బోనాల పండగ వైభవంగా జరుగుతుంది. ఈ పండుగకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. సికింద్రాబాద్ బోనాలు సాధారణంగా రెండు రోజుల పాటు జరుగుతాయి. మొదటి రోజున మహిళలు ఉదయం నుండి తమ ఇళ్ల నుండి బోనాలను నెత్తిన పెట్టుకుని ఆలయానికి చేరుకుంటారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి బోనం (భోజనం) సమర్పిస్తారు.
ఇక రెండో రోజున రంగం కార్యక్రమం జరుగుతుంది. స్వర్ణలత అమ్మవారి రూపంలో భవిష్యవాణి చెబుతారు. పచ్చి కుండపై నిలబడి రాబోయే సంవత్సరం ఎలా ఉండబోతుందో, ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆమె తెలియజేస్తారు. ఈ కార్యక్రమానికి కూడా వేలాది మంది భక్తులు హాజరవుతారు. స్వర్ణలత ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న ఆరో తరం రంగం చెప్పేవారు. అంతకుముందు వారి అక్క స్వరూప, వారి నానమ్మ బాగమ్మ, పూర్వీకులు జోగమ్మ, పోషమ్మ వంటి వారు ఈ బాధ్యతను నిర్వర్తించారు. ఈ సంప్రదాయం దాదాపు 200 సంవత్సరాల నాటిదని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. తొలుత ఇది మహంకాళి బోనాల పండుగలో భాగం కాకపోయినా.. కాలక్రమేణా ప్రధాన ఆచారంగా స్థిరపడింది. గ్రామీణ ప్రాంతాల్లో వర్షాలు, పంటలు, ప్రజల ఆరోగ్యం వంటి విషయాలపై అమ్మవారు భవిష్యవాణి చెప్పడం ఈ ఆచారం యొక్క ముఖ్య ఉద్దేశం.
రంగం భవిష్యవాణి తెలంగాణ ప్రజలకు ఒక ముఖ్యమైన నమ్మకం. అమ్మవారు చెప్పే మాటలను దైవ వాక్కుగా భావిస్తారు. రాబోయే ఏడాదిలో వర్షాలు ఎలా ఉంటాయి, ప్రజలకు ఎలాంటి కష్టాలు వస్తాయి, వాటి నివారణకు ఏం చేయాలి వంటి విషయాలను స్వర్ణలత గారు రంగం ద్వారా తెలియజేస్తారు. ఇది ప్రజలకు ఒక రకమైన మార్గదర్శకంగా, భరోసాగా ఉంటుంది. ఆమె చెప్పే మాటలను శ్రద్ధగా విని, వాటిని ఆచరించడానికి ప్రయత్నిస్తారు. 1997 నుంచి ఆమె ఆలయంలో రంగం భవిష్యవాణి వినిపిస్తున్నారు.