|
|
by Suryaa Desk | Tue, Jul 01, 2025, 10:57 PM
బీజేపీ తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ పార్టీ కేంద్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కేంద్రమంత్రి శోభాకరంద్లాజే ఆయన ఎన్నికను అధికారికంగా ప్రకటించారు. అనంతరం రాంచందర్రావుకు నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి నుంచి నూతన అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మాట్లాడిన ఆయన తొలి స్పీచ్లోన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను అందరూ అనుకున్నట్లు సౌమ్యుడిని కాదని అన్నారు. క్యాంపస్లో చదువుతున్న రోజుల్లోనే 14 సార్లు జైలుకు పోయినట్లు చెప్పుకొచ్చారు. విద్యార్థుల సమస్యలపై పోరాటం చేసి లాఠీ దెబ్బలు తిన్న విషయాన్ని గుర్తు చేశారు.
బీజేపీలో 'కొత్త', 'పాత' అనే భేదాలు లేవని స్పష్టం చేశారు. బిడ్డ పుట్టగానే కుటుంబ సభ్యులు అయినట్టు పార్టీలో చేరగానే వారంతా పార్టీ కుటుంబ సభ్యులే అని వ్యాఖ్యనించారు. తాను పేరుకే అధ్యక్షుడినని ఎప్పటికీ కార్యకర్తను, ప్రజల సేవకుడినేనని పేర్కొన్నారు. పార్టీ ఈ స్థాయికి ఎదిగిందంటే ఎంతో మంది కార్యకర్తల, నాయకుల త్యాగాలు, చెమట కష్టమే కారణమని కొనియాడారు. నక్సలైట్ల తూటాలకు బలైన బీజేపీ నాయకుల బలిదానాల వల్లే పార్టీ ఈ స్థాయికి ఎదిగిందని, తాను కూడా నక్సలైట్ బాధితుడినేనని గుర్తుచేసుకున్నారు.
కలిసికట్టుగా గోల్కొండ కోటపై బీజేపీ జెండా ఎగరేద్దామని పిలుపునిచ్చారు. తెలంగాణ యువత రాజకీయాల్లోకి రావాలని, యువకులు, మహిళలు బీజేపీలోకి రావాలని అన్నారు. తెలంగాణ ప్రజలంతా బీజేపీవైపు చూస్తున్నారని, పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు వాట్సాప్ యూనివర్సిటీలను పెట్టుకుని ఫేక్ న్యూస్తో ట్రోలింగ్ చేస్తున్నాయని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను క్రిమినల్ లాయర్ను కాబట్టి ఫేక్ న్యూస్ సూత్రధారులను బోనులో నిలబెట్టేందుకూ వెనుకాడనని హెచ్చరించారు.
రాంచందర్ రావు సౌమ్యుడు, మెతక మనిషే అయినా యుద్ధంలోకి దిగితే యోధుడినేనని అన్నారు. ఏబీవీపీలో ఉన్నప్పుడు జైలుకు వెళ్లి, పోలీసుల లాఠీ దెబ్బలు తిని, కాళ్లు, చేతులు విరగ్గొట్టుకున్నా సిద్ధాంతాన్ని వీడకుండా పనిచేసిన అనుభవం తనకు ఉందని చెప్పారు. గతంలో విద్యార్థులు, న్యాయవాదులు, పేదల పక్షాన న్యాయ పోరాటం చేశానని ఇకపై తెలంగాణ ప్రజల పక్షాన అలుపెరగని పోరాటాలకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. అందరితో కలిసి పనిచేసి బీజేపీని అధికారంలోకి తీసుకొస్తానని ధీమా వ్యక్తం చేశారు.