![]() |
![]() |
by Suryaa Desk | Fri, May 23, 2025, 06:38 PM
బంగ్లాదేశ్లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత, నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ తాను పదవి నుంచి వైదొలగనున్నట్లు సంకేతాలిచ్చారు. అన్ని పార్టీలు తనకు పూర్తి మద్దతు ఇవ్వని పక్షంలో రాజీనామా చేస్తానని హెచ్చరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్-ఉజ్-జమాన్ డిసెంబర్ నాటికి ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేయడం, మరోవైపు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) ఎన్నికల నిర్వహణకు స్పష్టమైన ప్రణాళిక కోరుతూ ఆందోళనలు ఉధృతం చేసిన నేపథ్యంలో యూనస్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.తాజా రాజకీయ పరిణామాలు, నిరసనల మధ్య తాను పనిచేయలేకపోతున్నానని యూనస్ ఆవేదన వ్యక్తం చేసినట్లు నేషనల్ సిటిజన్ పార్టీ (ఎన్సీపీ) నేత నహీద్ ఇస్లాం బీబీసీ బంగ్లాకు తెలిపారు. "నన్ను బందీగా పట్టుకున్నట్లుంది. ఇలా పనిచేయలేను. రాజకీయ పార్టీలన్నీ ఒక ఉమ్మడి అవగాహనకు రాలేవా?" అని యూనస్ తనతో అన్నట్లు నహీద్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం ప్రభుత్వ అతిథి గృహం 'జమున'లో యూనస్తో జరిగిన సమావేశంలో తాను కూడా ఉన్నానని, పదవిలో కొనసాగాలని నహీద్ ఆయన్ను కోరారని మరో ఎన్సీపీ నేత ఆరిఫుల్ ఇస్లాం అదీబ్ ఏఎఫ్పీ వార్తా సంస్థకు తెలిపారు. యూనస్ రాజీనామా చేయాలనుకున్నారని, అయితే కేబినెట్ సభ్యులు నచ్చజెప్పడంతో ప్రస్తుతానికి విరమించుకున్నారని అధికారిక వర్గాలు తెలిపాయి.