![]() |
![]() |
by Suryaa Desk | Fri, May 23, 2025, 02:43 PM
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదల సంక్షేమమే ధ్యేయంగా అనేక పథకాలను అమలు చేస్తోంది. ముఖ్యంగా ఎన్నికల ప్రచార సమయంలో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను నెరవేర్చడంలో భాగంగా తాజా చర్యగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించడం గమనార్హం. ఈ చర్య ద్వారా రాష్ట్రంలోని పేద, బలహీన వర్గాలకు న్యాయం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. కొత్త రేషన్ కార్డుల జారీ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించిన ప్రకారం, రాష్ట్రంలోని పేద బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందించే విధంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.55 లక్షల కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 25వ తేదీ నుండి అర్హులైన లబ్దిదారులకు మెసేజ్ల ద్వారా సమాచారం పంపించనున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో, వచ్చే నెల నుంచి సన్న బియ్యం పంపిణీ ప్రారంభం అవుతుందని స్పష్టం చేశారు. గ్రామ సభల ద్వారా ఎంపిక కొత్తగా మంజూరైనవారికి మే 25 నుంచి మొబైల్ లకు మెసేజ్ లు వస్తాయని పౌర సరఫరాల శాఖ పేర్కొంది. కొత్త రేషన్ కార్డుదారులకు వచ్చే నెల సన్నబియ్యం పంపిణీ ఉంటుందని స్పష్టం చేసింది. గ్రామ సభల ద్వారా ఎంపికైన వారికి కొత్త కార్డులు మంజూరు చేసినట్లు వివరించింది. కొత్త రేషన్ కార్డులతో కలిపి రాష్ట్రంలో 3 కోట్ల మంది రేషన్ లబ్దిదారులుగా ఉన్నారు. వీరికి నెలకు 1.89 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమని ప్రభుత్వం అభిప్రాయపడింది. ఉచిత సన్న బియ్యం పథకం - రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో ఉచిత సన్నబియ్యం పథకం ప్రారంభించారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని పేద కుటుంబాల్లోని ఒక్కో వ్యక్తికి నెలకు 6 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఒక కుటుంబంలో గరిష్టంగా ఆరుగురు వ్యక్తులకు 6 కిలోల చొప్పున నెలకు 36 కిలోల సన్న బియ్యం అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కేంద్ర సూచన - మూడు నెలల రేషన్ ఒకేసారి పంపిణీ అన్ని రాష్ట్రాల్లో మూడు నెలల రేషన్ ఒకేసారి ఇవ్వాలని కేంద్ర ఆహార ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాహుల్ సింగ్ అన్ని రాష్ట్రాలకు లేఖ రాశారు. వర్షాకాలంలో రేషన్ రవాణా ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితుల్లో, అన్ని రాష్ట్రాల్లో మూడు నెలల రేషన్ ఒకేసారి ఇవ్వాలని, వర్షాకాలం ముందే ఈ చర్య తీసుకుంటున్నట్టు లేఖలో పేర్కొన్నారు. అయితే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని సామాన్య ప్రజలు, తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తోంది ప్రభుత్వం. మే నెలలో ఇవ్వాల్సిన రేషన్ కోటాను ఇప్పటికే ఇచ్చేసింది. ఇక జూన్ లో మూడు నెలల కోటాను ఒకేసారి విడుదల చేస్తామని రాష్ట్రప్రభుత్వం కేంద్రప్రభుత్వానికి వివరించినట్లు సమాచారం.