|
|
by Suryaa Desk | Thu, Jan 08, 2026, 07:54 AM
సంక్రాంతికి అన్నీ కుటుంబ కథా చిత్రాలే వస్తున్నాయని, అన్నీ విజయవంతమై నిర్మాతలు సుభిక్షంగా ఉన్నప్పుడే అసలైన సంక్రాంతి అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆయన కీలక పాత్రలో, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రంలో నయనతార కథానాయికగా నటించగా, వెంకటేశ్ ముఖ్య పాత్ర పోషించారు. ఈ సినిమా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ-రిలీజ్ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ ఈ సంక్రాంతి ఒక్క ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాకే కాదు.. తెలుగు సినిమా పరిశ్రమ మొత్తానికి కావాలన్నారు. ప్రభాస్, రవితేజ, శర్వానంద్, నవీన్ పొలిశెట్టి సినిమాలన్నీ విజయాలు సాధించాలని, ఆ విజయాలను ప్రేక్షకులు ఆదరిస్తారని ఆకాంక్షించారు.వెంకటేశ్తో కలిసి పనిచేస్తే సమయం ఎలా గడిచిపోతుందో తెలియదని చిరంజీవి అన్నారు. జీవిత పరమార్థం గురించి వెంకీ చెబుతుంటే మోడ్రన్ గురువులా అనిపిస్తాడని అన్నారు. సినిమా, వ్యక్తిగత జీవితాన్ని అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తాడని కొనియాడారు. లాస్ ఏంజిల్స్లో తామిద్దరం కలిసి ఫోటో దిగినప్పటి నుంచే ఆయనతో సినిమా చేయాలన్న కోరిక ఉందని, ఇప్పుడు అది నిజమైందన్నారు. థియేటర్లో తమ కాంబినేషన్ను ప్రేక్షకులు ఆస్వాదిస్తారని, క్లైమాక్స్ మరోస్థాయిలో ఉంటుందని అన్నారు. తమ ఇద్దరి కాంబినేషన్లో త్వరలోనే ఫుల్ లెంగ్త్ సినిమా చేస్తామని, దానికి తగ్గ కథను సిద్ధం చేసుకోవాలని వేదికపై నుంచే అనిల్ రావిపూడికి చిరంజీవి సూచించారు.
Latest News