|
|
by Suryaa Desk | Fri, Oct 17, 2025, 05:03 PM
తెలంగాణలో మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియకు అనూహ్యంగా స్వల్ప స్పందన లభిస్తోంది. దరఖాస్తుల గడువు ముగింపునకు ఒక్క రోజే మిగిలి ఉన్నప్పటికీ, ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో ఎక్సైజ్ శాఖ అధికారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పరిస్థితి ఎంతగా దిగజారిందంటే, దరఖాస్తులు పెంచేందుకు గాను.... గతంలో లైసెన్సులు పొందిన వారికి స్వయంగా సందేశాలు (ఎస్ఎంఎస్) పంపి మరీ దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నారు.రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాల లైసెన్సుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. రేపటితో ఈ గడువు ముగియనుంది. అయితే, గురువారం నాటికి కేవలం 25 వేల దరఖాస్తులు మాత్రమే వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ వర్గాలు తెలిపాయి. బుధవారం వరకు 9,600 దరఖాస్తులు రాగా, గురువారం ఒక్కరోజే 10 వేల దరఖాస్తులు వచ్చాయి. అయినప్పటికీ, ఈ సంఖ్య గతేడాదితో పోలిస్తే చాలా తక్కువ.గత ఏడాది మద్యం దుకాణాల కోసం ఏకంగా 1.31 లక్షల దరఖాస్తులు రాగా, ఈసారి ఆ సంఖ్య దారుణంగా పడిపోయింది. చివరి రోజు దరఖాస్తులు వెల్లువెత్తినా, మొత్తంగా లక్ష లోపే పరిమితం కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామం ప్రభుత్వ ఆదాయంపై ప్రభావం చూపుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.