|
|
by Suryaa Desk | Fri, Oct 03, 2025, 06:56 PM
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగరా మోగింది. మొత్తం ఐదు దశల్లో ఎంపీటీసీ, సర్పంచ్, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ రెడీ అయ్యింది. ఈ నెల అనగా అక్టోబర్ 9వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో నగదు, మద్యం రవాణాను అడ్డుకునేందుకు పోలీసులు, అబ్కారీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఎక్కడికక్కడ ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అబ్కారీ శాఖ కీలక ప్రకటన చేసింది. ఆ వివరాలు..
తెలంగాణలో సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన నేపథ్యంలో అబ్కారీ శాఖ అలర్ట్ అయ్యింది. రాష్ట్రంలో అక్రమ మద్యాన్ని అరికట్టేందుకు అధికారులు ముందస్తు ప్రణాళికలు రచిస్తున్నారు. ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాల నుండి తెలంగాణలో అక్రమంగా మద్యం ప్రవేశించకుండా చూడటం కోసం సరిహద్దుల్లో ఉన్న అన్ని తపాలా, పోలీస్, ఎక్సైజ్ స్టేషన్లను అలర్ట్ చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 34 ఎక్సైజ్ జిల్లాల పరిధిలోని.. 139 పోలీస్ స్టేషన్లలో గుడుంబా తయారీ, అమ్మకం, సరఫరా మీద ప్రత్యేక నిఘా పెట్టారు. దీంతో పాటుగా ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ కు నల్లబెల్లం మద్యం, ఇతర అక్రమ మద్యం రాకుండా తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలైన ఏపీ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి అక్రమ మద్యం రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకునేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నారు.
ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో.. అబ్కారీ శాఖ అధికారులు.. మద్యం దుకాణదారులను అలర్ట్ చేస్తున్నారు. అక్రమ మద్యం అమ్మకం వల్ల తలెత్తే సమస్యలు, ఎన్నికల నియమావళిపై అవగాహన కల్పిస్తున్నారు. నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవడం మాత్రమే దుకాణాలను తాత్కాలికంగా మూసి వేస్తామని హెచ్చరించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా తెలంగాణలోని మొత్తం 12,733 గ్రామ పంచాయతీలు, 1,12,288 వార్డుల్లో ఎలక్షన్ జరగనుంది. అక్టోబర్ 9న నామినేషన్ల ప్రక్రియతో మొదలయ్యే ఎన్నికల సమరం.. నవంబర్ 11వ తేదీన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియతో ముగియనుంది. సర్పంచ్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.