|
|
by Suryaa Desk | Sat, Jun 14, 2025, 08:30 PM
బనకచర్ల ప్రాజెక్టు అంశంపై తాను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాతే, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రికి లేఖ రాసినట్లుగా విడుదల చేశారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు అన్నారు. ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీరుపై ఆయన శనివారం తీవ్రంగా స్పందించారు.గతంలో కూడా తాను ఒక అంశంపై ప్రెస్ మీట్ పెట్టినప్పుడు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాత తేదీ వేసి మీడియాకు లేఖ విడుదల చేశారని హరీశ్ రావు ఆరోపించారు. బనకచర్ల విషయంలో తాను ఈరోజు పీపీటీ ఇచ్చిన తర్వాత, నిన్న కేంద్ర మంత్రికి లేఖ రాసినట్లుగా ఈరోజు విడుదల చేసినందుకు మంత్రి ఉత్తమ్కు ధన్యవాదాలు అంటూ హరీశ్ రావు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.కేవలం మీడియాకు లేఖలు విడుదల చేస్తే ప్రయోజనం లేదని హరీశ్ రావు అన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, బనకచర్ల ప్రాజెక్టు విషయంలో తక్షణమే అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.