![]() |
![]() |
by Suryaa Desk | Wed, May 21, 2025, 04:10 PM
లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు పాకిస్థాన్లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా 'ఆపరేషన్ సిందూర్' గురించి ఆయన లేవనెత్తిన ప్రశ్నలను పాకిస్థాన్ మీడియా తమకు అనుకూలంగా మలచుకుంటూ కథనాలను ప్రసారం చేస్తోంది. ఈ పరిణామం భారత రాజకీయ వర్గాల్లోనూ, మాజీ సైనికాధికారుల్లోనూ తీవ్ర చర్చకు దారితీసింది.గతంలో జరిగిన 'ఆపరేషన్ సిందూర్'ను ఉద్దేశిస్తూ రాహుల్ గాంధీ సోమవారం 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. ఈ ఆపరేషన్ గురించి పాకిస్థాన్ ఆర్మీకి ముందే సమాచారం అందించారని ఆరోపిస్తూ, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ గతంలో మాట్లాడిన ఓ వీడియోను కూడా ఆయన పంచుకున్నారు. అంతేకాకుండా, ఈ ఆపరేషన్లో భారత్ ఎన్ని యుద్ధ విమానాలను కోల్పోయిందో చెప్పాలని డిమాండ్ చేశారు. సైనిక చర్యకు సంబంధించిన సమాచారాన్ని ముందుగానే పాకిస్థాన్కి తెలియజేయడం నేరమని కూడా ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలను పాకిస్థాన్ మీడియా అందిపుచ్చుకుంది. 'ఆపరేషన్ సిందూర్' విఫలమైందని, ఈ ఆపరేషన్లో పాకిస్థాన్ భారత్ను ఓడించిందని ఆ దేశ మీడియా ఇప్పటికే విస్తృతంగా ప్రచారం చేసుకుంటోంది. భారత దాడుల్లో తమ వైమానిక స్థావరాలు దెబ్బతిన్నప్పటికీ, వైమానిక రక్షణ వ్యవస్థలు దెబ్బతిన్నప్పటికీ, పాకిస్థాన్ మాత్రం తమ ఓటమిని అంగీకరించడం లేదు. పైగా, భారత్కు చెందిన ఐదు యుద్ధ విమానాలను, ముఖ్యంగా రాఫెల్ జెట్ను కూల్చివేశామని గొప్పలు చెప్పుకుంటోంది. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా భారత్ ఎన్ని యుద్ధ విమానాలను కోల్పోయిందని ప్రశ్నించడంతో, పాకిస్థాన్ మీడియాకు ఇది మరింత ఊతమిచ్చినట్లయింది. రాహుల్ ప్రశ్నలు తమ వాదనలకు బలం చేకూర్చేలా ఉన్నాయని భావిస్తూ, పాక్ మీడియా ప్రత్యేక చర్చా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది.