|
|
by Suryaa Desk | Mon, May 19, 2025, 04:02 PM
అన్ని దేశాలు పర్యాటకులను రారమ్మని పిలుస్తుంటే స్పెయిన్ లోని కేనరీ ఐలాండ్ ప్రజలు మాత్రం మా దీవికి రావొద్దని చెబుతున్నారు. టూరిస్టుల రాకను నియంత్రించాలంటూ ఏకంగా రోడ్లపైకి వచ్చి మరీ ఆందోళన చేస్తున్నారు. అపరిమిత పర్యాటకంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెల్లువలా వస్తున్న పర్యాటకులను నియంత్రించాలని, తమ దీవులను కాపాడుకోవాలని డిమాండ్ తో ఆదివారం వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. ఆఫ్రికా వాయువ్య తీరంలో ఉన్న ఈ ఏడు దీవుల సమూహంలో "కేనరీస్ తినే ఉన్ లిమిటె" (కేనరీలకు ఓ హద్దుంది) అంటూ భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు."కేనరీ దీవులు అమ్మకానికి లేవు", "కేనరీ దీవులు ఇక స్వర్గం కాదు" వంటి నినాదాలున్న ప్లకార్డులను ప్రదర్శిస్తూ స్థానికులు నిరసన తెలిపారు. అపరిమిత పర్యాటకం వల్ల పర్యావరణం దెబ్బతినడంతో పాటు, స్థానికులకు ఇళ్లు దొరకడం కష్టంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. అద్దెలను నియంత్రించాలని, కొత్త పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టులను నిలిపివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అతిపెద్ద దీవి అయిన టెనెరిఫేలో 7,000 మంది, గ్రాన్ కెనరియాలో 3,000 మంది, లాంజరోట్లో 1,500 మంది, ఫ్యూర్టెవెంచురాలో 1,000 మంది ఈ నిరసనల్లో పాల్గొన్నారు.