|
|
by Suryaa Desk | Tue, Jan 06, 2026, 08:16 PM
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఇది ఊరటనిచ్చే న్యూసే. ప్రతి ఉద్యోగి భద్రతకు భరోసా కల్పిస్తూ.. రాష్ట్రంలోని అన్ని శాఖల సిబ్బందికి ఏకంగా రూ. 1 కోటి విలువైన ప్రమాద బీమా కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మంగళవారం శాసనసభలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం సింగరేణి, విద్యుత్ శాఖ కార్మికులతో ప్రారంభమైన ఈ భారీ బీమా పథకాన్ని.. భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని విభాగాలకు వర్తింపజేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ప్రతి ఉద్యోగి భద్రతా హక్కును కాపాడటమే తమ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని భట్టి విక్రమార్క ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సింగరేణి కార్మికులకు, డిస్కమ్స్లో పనిచేస్తున్న విద్యుత్ ఉద్యోగులకు ఈ రూ. 1 కోటి ప్రమాద బీమా సౌకర్యాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. అయితే.. దీనిని కేవలం రెండు శాఖలకే పరిమితం చేయకుండా.. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు కూడా భవిష్యత్తులో వర్తింపజేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన ప్రకటించారు. బ్యాంకుల ద్వారానే ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావడం వల్ల ప్రభుత్వం లేదా ఆయా సంస్థలపై అదనపు ఆర్థిక భారం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు.
కేవలం బీమా మాత్రమే కాకుండా.. కార్మికుల ఆరోగ్య సంరక్షణపై కూడా ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. సింగరేణి ఏరియా ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న డాక్టర్లు, నర్సింగ్, ఇతర సిబ్బంది పోస్టులను రాబోయే మార్చి నెల నాటికి పూర్తిగా భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం వెల్లడించారు. అంతేకాకుండా.. సింగరేణి కార్మికుల కోసం గోదావరిఖనిలో అత్యంత ఆధునికమైన 'క్యాత్ ల్యాబ్' ను మరో 75 రోజుల్లోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇది గుండె సంబంధిత సమస్యలతో బాధపడే కార్మికులకు ఎంతో మేలు చేస్తుందని చెప్పారు.
ఏళ్ల తరబడి సింగరేణి కోసం శ్రమించిన విశ్రాంత ఉద్యోగుల సంక్షేమాన్ని కూడా ప్రభుత్వం విస్మరించలేదని అన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు ఇళ్ల నిర్మాణం కోసం స్థలాల కేటాయింపు, గృహ వసతి కల్పన వంటి అంశాలపై సింగరేణి బోర్డుతో చర్చించి త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే.. 2047 నాటికి తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టే లక్ష్యంతో రూపొందించిన 'తెలంగాణ రైజింగ్-2047' విజన్ డాక్యుమెంట్ను ఆయన సభలో ప్రవేశపెట్టారు.