![]() |
![]() |
by Suryaa Desk | Wed, May 21, 2025, 03:59 PM
కోర్ సిటీలో మురుగు నీటి వ్యవస్థ ఆధునీకరణ కోసం చేపట్టిన జోన్-3 సీవర్ నెట్ వర్క్ ప్రాజెక్టు పనులతోపాటు షేక్ పేట్ జలమండలి కార్యాలయాన్ని ఎండీ అశోక్ రెడ్డి పరిశీలించారు. కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహీయుద్దీన్ తో కలిసి సమస్యాత్మకమైన ప్రాంతాల్లో నిర్మాణ దశలో ఉన్న పనుల్ని పరిశీలించారు.మొదటగా టోలిచౌకి ఫ్లై ఓవర్ ప్రధాన రహదారిలో చేపట్టే టన్నెలింగ్ పనులను ఆటంకాలు కాకుండా ఎలా చేపట్టాలో చర్చించారు. ఈ ప్రధాన రహదారిలో ప్రతినిత్యం రద్దీ ఎక్కువగా ఉండడంతో పనులు చేపట్టడం అంత సులువు కాదని అంచనా వేశారు. దాదాపు 8 నుంచి 11 మీటర్లు లోతులో జరిగే టన్నెలింగ్ పనులవల్ల ట్రాఫిక్, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా.. వర్షా కాలంలోపే పనులు పూర్తి చేయమని సూచించారు.టన్నెలింగ్ పనులు చేపట్టేటప్పుడు జీహెచ్ఎంసీ, ట్రాన్స్ కో, జలమండలి ట్రాన్స్ మిషన్, ఓ అండ్ ఎం అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిర్వహించాలన్నారు. పనులు చేపట్టే సమయంలో సరైన బారికేడ్లు, రక్షణ పరికరాలను ధరించి భద్రతా ప్రమాణాలు పాటించాలన్నారు. పైపు విస్తరణ పనులు పూర్తి చేసిన ప్రాంతాల్లో వెంటనే రోడ్డు మరమత్తులు పూర్తి చేయాలని అధికారులకు ఎండీ సూచించారు. అక్కడి నుంచి సమీపంలోని 7 టూంబ్స్ వెళ్లే రహదారిలో చేపట్టే అండర్ గ్రౌండ్ టన్నెలింగ్ పనులను నివాస గృహాల పటిష్ఠకు ఎలాంటి నష్టం కలగకుండా పనులు ఎలా చెయ్యాలో ప్రతిపాదనలను సమర్పించమని ఎండీ అధికారులను ఆదేశించారు. అనంతరం ఎండీ లైన్స్, పరిసర ప్రాంతాల్లో పురోగతిలో ఉన్న పైపులైన్ విస్తరణ పనుల్ని పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే.. వర్షాకాలం సమీపించిన తరుణంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా.. పనులు చేపట్టి వేగంగా పూర్తి చేయాలని ఎండీ అశోక్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
అంతకుముందు షేక్ పేట్ జలమండలి కార్యాలయాన్ని సందర్శించారు. అక్కడ పది సంవత్సరాలక్రితం నిర్మించిన 10 మి.లీ సామార్థ్యం కలిగిన రిజర్వాయర్లను ఇప్పటికి వినియోగంలోకి తీసుకురాకపోవడంపై ఆశ్చర్యం వ్యక్త పరిచారు. వెంటనే రిజర్వాయర్లను వినియోగంలోకి తీసుకుని, ఏయో ప్రాంతాల్లో నీటి సరఫరా చేయవచ్చో సర్వేచేసి వివరాలను సమర్పించాలని ఆదేశించారు. ఈ రిజర్వాయర్లు అందుబాటులో వస్తే షేక్పేట్ పరసర ప్రాంతాలలో నీటి సరఫరా మెరుగుపడే అవకాశం ఉందని అన్నారు. అనంతరం ఎండీ అశోక్రెడ్డి ఆ ప్రాంగణంలోని నీటిశుద్ధి కేంద్రాన్ని ఎమ్మెల్యేతో కలిసి పరిశీలించారు.ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్, ఆపరేషన్ డైరెక్టర్ అమరేందర్ రెడ్డి, సీజీఎంలు వినోద్ భార్గవ, రాజేందర్, జీఎంలు శ్రీను నాయక్, కుమార్, ప్రాజెక్టు, ఓ అండ్ ఎం అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
జోన్-3 సీవర్ నెట్ వర్క్ ప్రాజెక్టు:
మూసీనదికి ఉత్తరం వైపున కోర్ సిటీలో సీవరేజి వ్యవస్థ ఆధునికీకరణ కోసం జోన్ - 3 సీవర్ నెట్వర్క్ ప్రాజెక్టు పనులు చేపడుతున్నారు. 4 నియోజకవర్గాల పరిధిలో 33.50 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణానికి సంబంధించి రూ.297 కోట్ల వ్యయంతో జోన్ - 3 సీవర్ నెట్వర్క్ ప్రాజెక్టులో మొత్తం 135 కిలోమీటర్ల పొడవైన పైప్లైన్ నిర్మాణాన్ని జలమండలి చేపడుతోంది. నగరంలోని ఓల్డ్ సిటీలో ఉన్న గోషామహల్, నాంపల్లి, కార్వాన్తో పాటు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో సీవరేజి వ్యవస్థను ఆధునికీకరించడానికి ఈ ప్రాజెక్టు చేపట్టింది.