|
|
by Suryaa Desk | Sun, Sep 14, 2025, 03:58 PM
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడికి న్యాయస్థానం అండగా నిలిచి మానవీయతను చాటింది. జాతీయ లోక్ అదాలత్లో జరిగిన విచారణ సందర్భంగా.. బాధితుడి పరిస్థితిని అర్థం చేసుకున్న న్యాయమూర్తి నేరుగా అంబులెన్స్ వద్దకే వచ్చి విచారణ జరిపారు. ఈ కేసులో బాధితుడికి రూ.కోటి పరిహారం చెల్లించాలని బీమా సంస్థను ఆదేశించారు. వివరాల్లోకి వెళితే.. ములుగు జిల్లా వెంకటాపురం గ్రామానికి చెందిన జాపతి దీక్షిత్ (22) బాచుపల్లిలో ఇంజినీరింగ్ రెండో ఏడాది చదువుకుంటున్నాడు. 2023 ఆగస్టు 12న స్నేహితులతో కలిసి అనంతగిరి హిల్స్కు విహారయాత్రకు వెళ్లగా.. మార్గమధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అతడి తలకు తీవ్ర గాయమైంది. దీంతో అతడి శరీరం చచ్చుబడిపోయింది.
సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన దీక్షిత్ తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు, పద్మ తమ స్తోమతకు మించి సుమారు రూ.60 లక్షలు అప్పు చేసి అతడికి చికిత్స చేయించారు. ఈ క్రమంలో గో డిజిట్ ఇన్సూరెన్స్ సంస్థపై రూ.1.50 కోట్ల పరిహారం కోసం కేసు వేశారు. శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్లో ఈ కేసు విచారణకు వచ్చింది. బాధితుడు దీక్షిత్ తీవ్ర అనారోగ్యంతో కదల్లేని స్థితిలో అంబులెన్స్లో ఉన్నాడని తెలుసుకున్న న్యాయ సేవా సమితి చైర్పర్సన్, 12వ అదనపు చీఫ్ జడ్జి షౌకత్ జహాన్ సిద్ధిఖీ ఏమాత్రం సంకోచించకుండా నేరుగా అంబులెన్స్ వద్దకే వెళ్లారు. అక్కడ దీక్షిత్ ఆరోగ్య పరిస్థితిని, అతడి తల్లిదండ్రుల బాధను స్వయంగా చూశారు. వారి ఆర్థిక ఇబ్బందులను తెలుసుకున్నారు.
న్యాయమూర్తి షౌకత్ జహాన్ సిద్ధిఖీ మానవత్వాన్ని చాటుకున్నారు. బాధితుడికి తక్షణ సాయం అవసరాన్ని గుర్తించిన న్యాయమూర్తి.. నెల రోజుల్లోపు రూ.కోటి పరిహారాన్ని నేరుగా దీక్షిత్ బ్యాంకు ఖాతాలో జమ చేయాలని బీమా సంస్థను ఆదేశించారు. దీనికి బీమా సంస్థ ప్రతినిధులు కూడా అంగీకరించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి చొరవను, మానవత్వాన్ని పలువురు కొనియాడారు. న్యాయం కేవలం కోర్టు గదుల్లోనే కాకుండా.. అవసరం ఉన్నచోట కూడా అందించవచ్చని న్యాయమూర్తి నిరూపించారు. ఈ తీర్పు దీక్షిత్ కుటుంబానికి గొప్ప ఊరటనిచ్చింది.