![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 22, 2025, 07:53 PM
భారత్-పాకిస్థాన్ మధ్య కొన్ని రోజుల పాటు కొనసాగిన సైనిక దాడుల అనంతరం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ, సరిహద్దు వెంబడి మాత్రం కలకలం రేగింది. తాజాగా నియంత్రణ రేఖ సమీపంలో కొన్ని అతి తక్కువ దూరం ప్రయాణించగల చిన్న డ్రోన్లు భద్రతా దళాలకు లభ్యమయ్యాయి. వీటి వెనుక ఎవరున్నారు? ఇవి ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.మే 7 నుంచి 10వ తేదీ మధ్య పాకిస్థాన్ పంపిన చాలా డ్రోన్లను భారత సైన్యం కూల్చివేసినప్పటికీ, కొన్ని అతి చిన్న శ్రేణి డ్రోన్లు సరిహద్దులోని పలు ప్రాంతాల్లో కనుగొన్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ డ్రోన్లు ఆన్లైన్లో సులభంగా దొరికే చౌక రకం మోడళ్లను పోలి ఉన్నాయని, ఇవి ఎక్కువ దూరం ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉండవని తెలుస్తోంది. ఈ డ్రోన్లను ఎలా? ఎక్కడి నుంచి సేకరించారనే దానిపై ఆరా తీయడానికి నిఘా వర్గాల సహాయం తీసుకోవాలని భద్రతా ఏజెన్సీలు యోచిస్తున్నాయి. గత నెలలో జరిగిన డ్రోన్ల అమ్మకాలకు సంబంధించిన రికార్డులు, కొనుగోలుదారుల వివరాలు ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ల వద్ద ఉండవచ్చని, అవి దర్యాప్తులో కీలక ఆధారాలు కావచ్చని అధికారులు భావిస్తున్నారు.భారత్ ఈ భారీ డ్రోన్, వైమానిక దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది. పాకిస్థాన్ తన సైనిక దాడి సమయంలో 800 నుంచి 1,000 డ్రోన్లను మోహరించిందని ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ సుమేర్ డి'కున్హా ధ్రువీకరించారు. వీటిని భారత వైమానిక దళ సిబ్బంది, రక్షణ వ్యవస్థలు నిర్వీర్యం చేశాయని ఆయన తెలిపారు. ఇవి పది కిలోలకు పైగా పేలోడ్లను మోసుకెళ్లగలవని పేర్కొన్నారు. భారత భూభాగంలో వందలాది డ్రోన్ శకలాలు దొరికాయని, ఇది దాడి తీవ్రతను, భారత దళాల వేగవంతమైన, సమర్థవంతమైన ప్రతిఘటనను తెలియజేస్తోందని అధికారులు పేర్కొన్నారు.