|
|
by Suryaa Desk | Tue, Mar 10, 2026, 12:57 PM
దేశంలో అనేక నగరాలకంటే మన నగరం ఎంతో సురక్షితమైంది.. దీనిని మరింత అభివృద్ధి చేసుకుందామని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్రెడ్డి గారు అన్నారు. ప్రపంచ స్థాయి నగరంగా దీనిని తీర్చిదిద్దుకుందామని సూచించారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు.. తర్వాత అభివృద్ధిపై అందరూ దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి అన్నారు. హైడ్రా మొదటివిడతగా అభివృద్ధి చేసిన ఆరు చెరువుల్లో కూకట్పల్లి నల్లచెరువును నగర ప్రజలకు అంకితం చేసిన అనంతరం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్రెడ్డిగారు మాట్లాడారు. దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర కాలుష్యం ఉంది. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, పార్లమెంటుకు సెలవులు ఇచ్చే పరిస్థితి ఉంది. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీం కోర్టు, కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీలో ఉన్నప్పటికీ.. ఆ నగరాన్ని బాగు చేసే అవకాశం లేనంతగా కాలుష్యం పెరిగింది. ముంబయిలో వరదలొస్తున్నాయి. బెంగళూరులో ఎయిర్పోర్టుకు ఎన్ని గంటల్లో చేరుకుంటామమో చెప్పలేం. చెన్నైని వరదలు వేధిస్తున్నాయి. ఒక్క హైదరాబాదే సురక్షితమైన నగరంగా ఉంది. ఇక్కడ దేశంలోని నలుమూలల నుంచి వచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. వారందరికీ మెరుగైన జీవనాన్ని అందించడానికి నగరాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
గుజరాత్లోని సబర్మతి, ఉత్తర ప్రదేశ్లోని గంగానది, యుమునానది రివర్ ఫ్రంట్లు అభివృద్ధి చేసుకుని ప్రగతి సాధించామని చెబుతున్నారు. మనమెందుకు మన మూసీ నదిని అభివృద్ధి చేసుకోరాదని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. మూసీ పరివాహకంలోనే కాదు చెరువుల పునరుద్ధరణలో కూడా ఎవరికైనా నష్టం జరిగితే తగిన విధంగా నష్టపరిహారం చెల్లిద్దాం.. పేదలకు నష్టం చేయడం ప్రభుత్వ విధానం కాదు.. వారిని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. మూసీ ప్రక్షాళన మాత్రం జరగాల్సిందే. మహానగరంలో క్యూర్ పరిధిలో మూడు కార్పొరేషన్లు వచ్చాయి. కమిషనరేట్లు వచ్చాయి. రోడ్లు విస్తరించుకుందాం. పైవంతెనలు కట్టుకుందాం. పిల్లలకు క్రీడా మైదానాలు నిర్మించుకుందాం. ఒక మంచి నగరంగా హైదరాబాద్ను అభివృద్ధి చేసుకుందామన్నారు.
కూకట్పల్లి నల్లచెరువును పునరుద్ధరించాం.. చెరువు చుట్టూ పాత్ వే నిర్మించాం... ఇంకా చాలా ఆకర్షణలు రావాల్సి ఉంది. ఇంట్లో మనసు చికాకుగా ఉన్నప్పుడు ఈ చెరువుచుట్టూ ఒకసారి తిరిగితే కొద్దిగా తేలిక పడతారు. వృద్ధులు కానించి చిన్న పిల్లల వరకూ ఇలా చెరువుకి వచ్చి సేదదీరి వెళ్లవచ్చునని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ చెరువు అభివృద్ధి సమయంలో సమస్యలు తలెత్తాయి.. వాటిని అధిగమించి చెరువును ఎంతో బాగా అభివృద్ధి చేశారు. మీ ముఖాల్లో ఆ ఆనందం కనిపిస్తోంది. మీ సంతోషం చూస్తే.. నాకు ముచ్చటేస్తోంది అని అన్నారు. నాడు ఎంపీగా, ప్రశ్నించే గొంతుకగా, నేడు సీఎంగా మీ ముందు నిలబడటం ఎంతో ఆనందంగా ఉంది. నాడు ఎంపీగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే కోరిక ఉన్నా.. నిధులు, అలాంటి పరిస్థితులు లేక చేయలేకపోయాను. మీ ఆశీర్వాదంతో సీఎంను అయ్యాను. నాడు చేయలేకపోయిన అభివృద్ధి.. మల్కాజిగిరి పార్లమెంటు నియెజకవర్గంలోని ప్రతి వీధిని అభివృద్ధి చేస్తాను అని హామీ ఇచ్చారు.
హైడ్రాను ప్రారంభించినప్పడు.. హైడ్రా రంగంలోకి దిగినప్పడు అనేక విమర్శలుచేశారు. వాటన్నింటినీ సహనంతో భరించాను. భారీ వర్షాలు పడినప్పుడు వరదలు లేకుండా చేయడంలో. చెరువుల అభివృద్ధిలో హైడ్రా పని తీరు చూశాక చాలా సంతోషంగా ఉన్నాను. అంబర్పేటలోని బతుకమ్మకుంట.. పాతబస్తీలోని బమృకున్ - ఉద్ - దౌలా చెరువును ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు. ఇప్పుడు కూకట్పల్లి నల్ల చెరువునుచూసినా ఎంతో ముచ్చటేస్తోంది. ఇలాగే నగరంలోని అన్నిచెరువులను అభివృద్ధి చేసుకుని సుందరమైన, పర్యావరణహితమైన నగరంగా అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చరు. జనాభా 1.34కోట్లకు చేరింది. వలస వచ్చినవారు స్థోమతకు తగ్గట్లు ప్రభుత్వ భూములు, చెరువుల్లో ఇళ్లు కట్టుకుని కొంతమంది ఉండ వచ్చు.. కొందరు పేదలు నష్టపోయారు. మరికొందరు దుఃఖం కలిగిండొచ్చు. అలాంటి వారికి రెండు పడక గదుల ఇళ్లను ఇస్తాం. ఆ విషయాన్ని ఎమ్మెల్యేలకు చెప్పాను. ఏ పేద వాడి ఇళ్లు కూలగొట్టడం, నష్టం చేయడం మా ప్రభుత్వ ఉద్దేశం కాదు. చెరువుల్లో అక్రమ నిర్మాణాల వల్ల కాలనీలను ముంచేస్తాయి. మన జీవితకాలం కష్టమంతా వరదలో తడిసిపోతుంది.